రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో రజత పతక విజేత పుసర్ల వెంకట సింధూకు ప్రతిష్ఠాత్మక ‘ఖేల్ రత్న’ అవార్డు దక్కింది. ఈ నెల 29న ఢిల్లీలో సింధూకు ‘ఖేల్ రత్న’ అవార్డును బహూకరించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. కాగా, రెజ్లింగ్ లో వినీత్ ఫోగత్ కాంస్యం గెలుచుకోగానే, ఆమెకు ఖేల్ రత్న ఇవ్వాలని క్రీడాశాఖ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే గంటలు తిరక్కుండానే సింధూ పతకాన్ని ఖాయం చేసుకోవడం, రెండు రోజుల కిందటి మ్యాచ్ లో రజత పతకాన్ని గెలవడంతో, ఖేల్ రత్న సింధూ వశం కూడా అయ్యింది.
బ్యాడ్మింటన్ వరల్డ్ నంబర్ వన్ కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయినా, భారత ఖ్యాతిని సగర్వంగా చాటిన తెలుగుతేజం పీవీ సింధు, తనకిప్పుడు గాల్లో తేలినట్టుందని వ్యాఖ్యానించింది. “ఆటల పోటీలు ప్రారంభమైన వేళ, నాకు పతకం వస్తుందని, ఇంత దూరం ప్రయాణిస్తానని ఊహించలేదు. ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మాటల్లో చెప్పలేను, మేఘాల్లో విహరిస్తున్నట్టు అనిపిస్తోంది” అని వ్యాఖ్యానించింది. ఇండియా తరపున ఒలింపిక్స్ లో వ్యక్తిగత పతకం గెలుచుకున్న ఐదవ మహిళగా కరణం మల్లీశ్వరి, మేరీ కోం, సైనా నెహ్వాల్, సాక్షీ మాలిక్ ల సరసన చేరింది.



