అప్పుడు కాంగ్రెస్‌ ఇప్పుడు బిజెపి… పార్టీని పణంగా పెట్టి…

Bandi-Sanjay-Kumarఏపీ రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు కాంగ్రెస్‌ అధిష్టానం లాభనష్టాలు లెక్కగట్టుకొని ఏపీ, ఏపీలోని కాంగ్రెస్‌ పార్టీ నష్టపోయినా పర్వాలేదు… తెలంగాణ ఇస్తే తప్పకుండా ఆ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని భావించి తెలంగాణ ఏర్పాటు చేసిందని కాంగ్రెస్‌ నేతలే చెప్పుకొన్నారు. ఇప్పుడు బిజెపి కూడా సరిగ్గా అదే చేయబోతున్నట్లు కనిపిస్తోంది!

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చబోతున్నట్లు తాజా సమాచారం. బండి సంజయ్‌ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాతే నిద్రావస్థలో ఉన్న బిజెపిని లేపి లేడిలా పరుగులు పెట్టించారు. తెలంగాణలో తమకు తిరుగే లేదనుకొన్న సిఎం కేసీఆర్‌కు ముచ్చెమటలు పట్టించారు. ఈసారి ఎన్నికలలో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమనే భావన ప్రజలకి, పార్టీకి కలిగించగలిగారు.

ADVERTISEMENT

అయితే నేడో రేపో ఎన్నికల గంట మొగబోతున్న ఈ సమయంలో ఆయనను ఆ పదవిలో నుంచి తప్పించి కేంద్రమంత్రి వర్గంలోకి లేదా బిజెపి జాతీయ కార్యవర్గంలోకి తీసుకొని, కేంద్రమంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డికి తెలంగాణ బిజెపి పగ్గాలు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది.

అత్యంత కీలకమైన శాసనసభ ఎన్నికలకు ముందు బిజెపి అధిష్టానం ఇటువంటి అనూహ్య నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆ పార్టీలో సీనియర్ నేతలందరూ ఆయనపై పిర్యాదులు చేస్తుండటమే అని బిజెపి వర్గాలు చెపుతున్నాయి. ఇది పైకి చెప్పుకొంటున్న కారణం కాగా బిజెపి-బిఆర్ఎస్‌ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందని కాంగ్రెస్‌ నేతల ఆరోపణల నేపధ్యంలో చూసిన్నట్లయితే దీనిలో ఏదో మతలబు ఉందనిపిస్తుంది.

తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ముఖ్యమా లేక ఢిల్లీలో మోడీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం ముఖ్యమా?అదేవిదంగా తెలంగాణలో బిఆర్ఎస్‌ మళ్ళీ అధికారంలోకి రావడం ముఖ్యమా లేక కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో రాణించడం ముఖ్యమా? అని ప్రశ్నించుకొంటే సమాధానం అందరికీ తెలుసు.

కనుక బిజెపి-బిఆర్ఎస్‌ మద్య రహస్య అవగాహనలో భాగంగానే కేసీఆర్‌ ఒత్తిడి మేరకే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఈ కీలక సమయంలో ఆ పదవి నుంచి తప్పించి తెలంగాణలో బిజెపిని మళ్ళీ నిద్రపుచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు అనుమానం కలుగుతోంది.

ఇందుకు బదులుగా లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో బిజెపికి బిఆర్ఎస్‌ సహకరించవచ్చు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల పేరుతో ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్‌కు అడ్డుపడుతూ కొన్ని లోక్‌సభ సీట్లు గెలుచుకొని, ఎన్నికల తర్వాత అవసరమైతే కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు సాయపడవచ్చు. ఇందుకు బదులుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు నుంచి కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితకు విముక్తి ప్రసాదించవచ్చు.

కారణాలు ఏవైనప్పటికీ ఈ సమయంలో బండి సంజయ్‌ని మార్చడమంటే తెలంగాణ బిజెపిని పణంగా పెట్టడమే అని చెప్పక తప్పదు. ఆనాడు కాంగ్రెస్‌ ఏమి చేసిందో ఇప్పుడు బిజెపి ఆదేచేయబోతోందన్న మాట! ఈ వాదనలు నిజమా కాదా తెలియాలంటే లోక్‌సభ ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories