గతంలో రాజకీయాలు అంటే సేవ – బాధ్యత అని, అసెంబ్లీ అంటే దేవాలయం అని, నాయకులు అంటే అర్చకులు అనే భావనలో ఉండేవారు. కానీ రానురాను వాటి అర్దాలు మారిపోతూ చివరికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయాలు అంటే దాడులు – రౌడీయిజం అని, అసెంబ్లీ అంటే బూతులు తిట్టుకునే ఒక ప్రదేశమని, నాయకులు అంటే నటించేవాడనే స్థాయికి తీసుకువచ్చారు.
ఈ కోవకు చెందిన కొంతమంది వైసీపీ నాయకుల భవితవ్యం తేల్చడానికి సిద్ధంగా ఉన్నారు ఏపీ ప్రజానీకం. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొడాలి నాని, రోజా, అంబటి, విషయానికి వస్తే వీరు ఆయా ప్రాంతాలకు ఎమ్మెల్యే గా గెలుపొంది రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకోగలిగారు. అయితే ఆ స్థానానికి చేరుకోవడానికి ఏ స్థాయికైనా దిగజారిపోగలరనే సత్యాన్ని ఆవిష్కరించారు ఈ నేతలు.
వీరిని ఎమ్మెల్యే గా గెలిపించింది ఇందుకా అని సిగ్గుపడే స్థాయికి ఓటర్లను ఆలోచింపచేసిన ఈ ఉద్దండులు ఈ ఐదేళ్లుగా రాష్ట్రానికి కానీ తమను ఎన్నుకున్న ప్రాంత ప్రజలకి కానీ చేసింది ఏమైనా ఉంది అంటే అది బూతులు తిట్టడం ఎలా..? రాజకీయ విలువలను దిగజార్చడం ఎలా..? అనే విషయాల మీద సుదీర్ఘ ప్రసంగాలు వినిపించారు. అయితే ఈసారి జరగబోయే ఎన్నికలలో ఈ నోటి దూల నాయకుల నోటికి తాళం పడే అవకాశం ఉందంటూ పలు సర్వే సంస్థలు తేల్చి చెపుతున్నాయి.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతకు తోడు స్థానికంగా వీరి మీద వచ్చిన అవినీతి ఆరోపణలు, సమస్యలను పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకుల కుటుంబాలను రోడ్ల మీదకు తెచ్చే వీరి ఆసక్తితో ప్రజలు విసిగిపోయారని, దీనికి తోడు వీరికి ప్రత్యర్థిగా టీడీపీ కూటమి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపడంతో ఇక ఈ నేతల నోటికి తాళం ఖాయం అంటూ ప్రచారం ఊపందుకుంది.
ఇప్పటికే అంబటికి వ్యతిరేకంగా తన సొంత అల్లుడు బయటకు వచ్చి ఇటువంటి నీచుడికి ఎవరు ఓటు వేయొద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. అలాగే నగరిలో రోజా పై కూడా సొంత పార్టీ శ్రేణుల నుండే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ఇక నానికి ఆయన నోటి దూలే ఆయన ఓటమి కానుంది.





