హైదరాబాద్ నగరంలో ప్రతీరోజు లక్షల వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తుంటాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ఈ 9 ఏళ్ళలో 35 ఫ్లైఓవర్లు నిర్మించింది. పూర్తిగా ఉక్కుతో నిర్మించిన మరో ఫ్లైఓవర్కి నేడే (శనివారం) ప్రారంభోత్సవం జరిగింది.
ఇవికాక అనేక ప్రాంతాలలో అండర్ పాస్ రోడ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కై వాక్లు నిర్మించింది. వాహనాల కోసమే కాక జాగింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ కూడా త్వరలోనే ప్రారంభోత్సవం కాబోతోంది!
ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెట్రో రైలు కోసం నగరం నడిబొడ్డున భూసేకరణ చేసి, రద్దీగా ఉండే రోడ్ల మద్య మెట్రో పిల్లర్లు నిర్మించి మెట్రో రైలు మార్గాలని, విమానాశ్రయాలకు తీసిపోనివిదంగా మెట్రో స్టేషన్లను నిర్మించడం మరో ఎత్తు.
ఇవేకాక తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు, కేబిల్ బ్రిడ్జిలు, విశాలమైన రోడ్లు కూడా నిర్మించింది. అక్కడ కూడా రద్దీగా ఉండే రోడ్లలోనే ఈ నిర్మాణాలన్నీ జరిగాయి. వీటన్నిటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం కేవలం 9 ఏళ్ళలోనే పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వం… నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని గుడివాడ పట్టణంలో ఒకే ఒక్క ఫ్లైఓవర్ నిర్మించలేకపోయారు.
హైదరాబాద్లో సుమారు కోటి మందికి పైగా జనాభా, లక్షల వాహనాలు ఉన్నాయి. కానీ గుడివాడ పట్టణంలో కేవలం 1.69 లక్షల మంది జనాభా, కొన్ని వేల వాహనాలు మాత్రమే ఉన్నాయి. అయినా పట్టణంలో ఒకే ఒక్క అత్యవసరమైన ఫ్లైఓవర్ని నిర్మించలేకపోతోంది వైసీపీ ప్రభుత్వం.
గుడివాడ పట్టణం మద్యలో నుంచి రోజుకి 60 ప్యాసింజర్ రైళ్లు, 20 గూడ్స్ రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రతీ 15-20 నిమిషాలకు ఒకటి లేదా రెండు రైళ్ళు తిరుగుతుంటాయి. పట్టణం మద్యలో భీమవరం రైల్వేగేటు, దాని సమీపంలో మరో రైల్వే గేటు ఉన్నాయి. కనుక ప్రతీ 15-20 నిమిషాలకు రెండు గేట్లు పడుతూనే ఉంటాయి.
దాంతో రైల్వే ట్రాకుకి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోతూనే ఉంటాయి. గేట్లు తెరిచిన తర్వాత అవన్నీ రైల్వే ట్రాక్ దాటేలోగానే మరో రైలు వస్తుంటుంది. కనుక మళ్ళీ గేట్లు పడతాయి. మళ్ళీ వాహనాలు గేట్లవద్ద పేరుకుపోతుంటాయి. దశాబ్ధాలుగా గుడివాడవాసులు ఈ రెండు రైల్వే గేట్ల వద్ద చిక్కుకొని నరకం అనుభవిస్తున్నారు.
టిడిపి హయాంలో ఇక్కడ రెండు రైల్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు రూ.239.55 కోట్ల ప్రతిపాదనలు సిద్దం చేసింది. కానీ రెండు బ్రిడ్జిలు నిర్మించడం కంటే ఒకటే వైసీపీ ఆకారంలో నిర్మిస్తే బాగుంటుందని ఆ ప్రతిపాదన పక్కన పెట్టేసింది.
ఈలోగా ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం ఏడాదిన్నరపాటు ఈ ప్రాజెక్టుపై కూర్చొని పొదిగిన తర్వాత ఎట్టకేలకు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఒత్తిడి మేరకు 2022, డిసెంబర్లో అట్టహాసంగా శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారు.
2024 మార్చిలోగా ఈ వంతెన పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని కొడాలి నాని అప్పుడే ‘రిలీజ్ డేట్’ కూడా ప్రకటించారు. ఆ వంతెన నిర్మాణ పనుల కాంట్రాక్ట్ కూడా తన అనుచరులు, సన్నిహితులకే ఇప్పించుకొన్నారు. వడ్డించేవాడు మనోడే కనుక నిధుల మంజూరుకి ఇబ్బంది కూడా ఉండదు. మరింకేమి… చకచకాపనులు జరిగిపోయి ఈపాటికి వంతెన నిర్మాణ పనులు కనీసం 75 శాతం పూర్తయిపోయి ఉండాలి. కానీ ఇంతవరకు వంతెన పనులే మొదలుపెట్టలేదు! అంటే వైసీపీ హయాంలో ఇది పూర్తికాదన్నమాట!
తెలంగాణ ప్రభుత్వం దేనికైనా శంకుస్థాపన చేస్తే ఆ పని పూర్తయిపోయిన్నట్లే లెక్క. కానీ ఇక్కడ ఏపీలో శంకుస్థాపనలు, శిలాఫలకాలు ప్రజలను మభ్యపెట్టడానికే అని గుడివాడ వంతెనకు కొడాలి నాని వేసిన శిలాఫలకమే సాక్ష్యం.



