పార్టీ పరిస్థితి అంతకంతకు క్లిష్టంగా మారుతున్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ నేతల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ 170 నియోజకవర్గాలలో విజయం సాధిస్తుందని ఆ పార్టీ గుడివాడ ఎమ్మెల్యే నాని అన్నారు. ఓడిపోయే ఆ ఐదు సీట్లు ఏంటో మాత్రం ఆయన చెప్పలేదు.
అయితే ఈ వాదనకు విరుద్ధంగా ఉంది రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి. ఇటీవలే జరిగిన కర్నూల్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కనీసం ఆ పార్టీ తరపున పోటీ చెయ్యడానికి ముందుకు వచ్చిన వారు లేరు. ఒక పక్క ప్రజా సంకల్పయాత్ర పేరుతో జగన్ పాదయాత్ర చేస్తున్నారు. ఇటీవలే కర్నూల్ లో పాదయాత్ర పూర్తి అయ్యింది.
అయినా పోటీకి ఎవరు ముందుకు రాలేదు అంటే ఆయన పాదయాత్ర వారిలో ఏమాత్రం ప్రభావం చూపిందో అర్ధమవుతూనే ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిపి ఇప్పటిదాకా 30 మంది వరకు ఆ పార్టీని వదిలి టీడీపీలో జాయిన్ అయిపోయారు. వైకాపాకు భవిష్యత్తు లేదనే వారు తమ దారి తాము చూసుకున్నారు అంటే కాదని వాదించడం కష్టమే.
ఒకప్పుడు ఆవేశంలో నోరు పారేసుకోకపోతే ఈపాటికి నాని కూడా సొంతగూటికి చేరేవారని గుడివాడలో అంతా అనుకుంటున్నారు. టీడీపీ తలుపులు తీయకపోవడంతో ఇంకా జగన్ నే నమ్ముకున్నారు నాని అని ఆయన వర్గంవారే చెబుతూ ఉంటారు. 170 సీట్లలో గెలుస్తాం అని చెప్పడం అంటే మింగమెతుకు లేకపోయినా మీసాలకు సంపెంగ నూనెలా ఉందిగా.



