కోదండరాం ఇటీవలే ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి పార్టీ(టీజేఎస్) ఆవిర్భావ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ఆయన మండిపడ్డారు. నగరం నడిబొడ్డున సభలు జరిపితే, అక్కడికి వచ్చే వాహనాల పొగ వల్ల కాలుష్యం పెరుగుతుందని, పైగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే అనుమతివ్వడంలేదని పోలీసులు పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు.
‘‘మేం సభ పెడతామంటే వద్దన్నారు. అదే మొన్న ‘భరత్ అనే నేను’ సినిమాకు ఎల్బీ స్టేడియంలో అనుమతి ఇచ్చారు. ఆ సభకు వాహనాలు రాలేదా? ఆ వాహనాల నుంచి పొగ రాలేదా?’’ అని కోదండరాం ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడిన వారికంటే మహేష్ బాబు ఎక్కువా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా 29న సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. కోదండరాం కాంగ్రెస్ ఏజెంట్ అంటూ తెరాస వారి ఆరోపణలకు కూడా ఆయన సమాధానం చెప్పారు. “సమస్యల పరిష్కారాల కోసం నాలుగేళ్లుగా కొట్లాడుతున్నాం. ఆ ఉద్యమ స్ఫూర్తి నుంచి పుట్టిందే తెలంగాణ జనసమితి పార్టీ. ఎవరో వెనుక ఉండి చెబితే పెట్టిన పార్టీకాదిది,” అని అన్నారు.



