కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ టార్గెట్ గా చేసిన విమర్శలు ఆపై సురేఖ కేంద్రంగా మొదలైన వివాదం తాలూకా పంచాయితీ ఎట్టకేలకు ఢిల్లీ అధిష్టానం ముందుకు చేరింది. సీఎం రేవంత్ విదేశీ పర్యటన అనంతరం కొండా వివాదానికి మంత్రి పదవి బర్తరఫ్ తో ఒక ఎండ్ కార్డు పడుతుందని అందరు భావించారు.
కానీ ఈ లోపు రాఖీ పండుగ రావడం, ఆ పండుగ రోజున కొండా సురేఖ సీఎం రేవంత్ కి బంగారు రాఖీ కట్టడం, ఆ సమయంలో రేవంత్ కూడా ఎటువంటి వివాదానికి తావివ్వకుండా రాఖీ కట్టించుకోవడంతో వివాదాన్ని రాఖీతో ముగించిందా కొండా కుటుంబం అంటూ వార్తలు గుప్పుమన్నాయి.
అయితే వివాదం ఇక్కడితో ముగిసిపోలేదని, ఇంకా అసలు కథ మిగిలే ఉందన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇలా ఒక్కొక్కరుగా ఢిల్లీ బాట పట్టారు.
కేబినెట్ విస్తరణ లో భాగంగా వీరంతా ఢిల్లీ పర్యటన లో ఉండగా అధిష్టానం నుంచి మంత్రి కొండా సురేఖకు కూడా పిలుపు రావడం, ఆమె తక్షణమే ఢిల్లీ పయనం అవ్వడంతో కొండా వివాదానికి అధిష్టానం ఎండ్ కార్డు వెయ్యనుందా అన్న చర్చ మొదలయ్యింది.
అయితే ఇప్పటికే ఈ వివాదం పై పార్టీ క్రమశిక్షణ కమిటీ అధిష్టానానికి ఒక నివేదిక ఇవ్వగా, అందులో కొండా సురేఖ ను మంత్రి పదవి నుంచి తొలగించాలని అనే డిమాండ్ గట్టిగా వినిపించినట్టు సమాచారం. ఇప్పటికే సీఎం రేవంత్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తో పాటుగా పార్టీ మెయిన్ హెడ్ రాహుల్ గాంధీ తో భేటీ అయ్యారు.
అటు సురేఖ కూడా ఢిల్లీ చేరుకోవడంతో ఈ వివాదం ఇక్కడితో ముగుస్తోందా.? సురేఖ గాంధీ కుటుంబం ఆశీస్సులు తిరిగొస్తారా.? లేదా క్రమశిక్షణ కమిటీ నివేదిక అనుసరించి అధిష్టానం కొండా సురేఖ పై చర్యలకు ఆదేశిస్తుందా అన్నది కాంగ్రెస్ పార్టీ లో మంత్రి పదవి ఆశావహులకు ఆసక్తిగా మారింది.






