కృష్ణా జిల్లాలో టిడిపి-వైసీపీ గేమ్ స్టార్ట్ అయ్యిందిగా!

Chandrababu-Naidu-Mandali-Budha-Prasadఏపీలో ఎన్నికలకు ఇంకా 9 నెలలు సమయం ఉన్నప్పటికీ నేడో రేపో ఎన్నికలు జరుగబోతున్నట్లుంది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో మార్పులను తేలికగా కొట్టి పడేయలేము. ఇప్పటికే ఓ వైపు నుంచి టిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రతో సునామీలా దూసుకువస్తున్నారు.

మరోవైపు రెండువారాలుగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గోదావరి జిల్లాలలో వారాహి యాత్రతో హీటెక్కించేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌లను లేదా ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్ధులను ప్రకటించేస్తున్నారు.

ADVERTISEMENT

బిజెపి ఇప్పటికే కిరణ్‌ కుమార్‌ రెడ్డిని బరిలో దింపగా, కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలని బరిలో దింపబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బిజెపి సైలంట్ అయిపోయినప్పటికీ త్వరలోనే మళ్ళీ ఢిల్లీ నుంచి బిజెపి పెద్దలు ఏపీలో పర్యటించడం ఖాయమే.

కనుక ఈ రాజకీయ పరిణామాలన్నిటినీ కలిపి చూస్తే 2019 ఎన్నికల సమయంలో టిడిపి ప్రభుత్వాన్ని ఏవిదంగా నలువైపుల నుంచి శత్రువులు కమ్ముకొన్నారో, మళ్ళీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని కూడా సరిగ్గా అలాగే రాజకీయ ప్రత్యర్ధులు చుట్టుముట్టిన్నట్లు కనిపిస్తోంది. అంటే ఇవన్నీ రాష్ట్రంలో మార్పు అనివార్యమని సూచిస్తున్నట్లు భావించవచ్చు.

తాజాగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి పరుచూరి శుభాష్ చంద్రబోస్‌తో పాటు ఆయన అనుచరులు శుక్రవారం చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరిపోయారు.

ద్వితీయశ్రేణి నేతలు చేరితే పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు కానీ వైసీపీ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న వ్యక్తి పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరడం గమనిస్తే ప్రభుత్వం మార్పు అనివార్యమని వైసీపీ నేతలు కూడా గ్రహించిన్నట్లే ఉన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “పురాణాలలో అనేక మంది రాక్షసుల గురించి విన్నాము. కానీ వారందరికంటే అతి పెద్ద రాక్షసుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఛాన్స్ అంటూ అధికార పగ్గాలు చేపట్టి కేవలం నాలుగేళ్ళలోనే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నాడు.

అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలవాల్సిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీ… అవి ప్రభుత్వ భూములు కావచ్చు… కొండలు కావచ్చు లేదా మట్టి ఇసుక కావచ్చు. కనుక ఈ అవినీతిని, దోపిడీని, అరాచకాలను అరికట్టాలంటే ముందు మనమే మారాలి. మన కోసం, మన రాష్ట్రం, మన పిల్లల భవిష్యత్‌ కోసం మనమే పోరాడక తప్పదు.

వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌ మరోసారి ఓడిపోతుంది. కనుక ఆంధ్రప్రదేశ్‌ని గెలిపించుకోవాలంటే వైసీపీని ఓడించక తప్పదు. రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాల్సిన సమయం ఇది. మనం మారకపోతే మన జీవితాలు ఎన్నటికీ మారవని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి,” అని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories