కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి తరలనుంది. ఈ మేరకు కార్యాలయం తరలింపునకు చర్యలు తీసుకోవాలని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ.. కృష్ణా బోర్డు ఛైర్మన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్యాలయాన్ని ఏపీలోని వెలగపూడికి తరలించాల్సిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85(2) ప్రకారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఏర్పాటు చేయాల్సి ఉందని, కార్యాలయానికి అనువైన భవనాన్ని ఎంపిక చేసి తరలించేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి చేసింది.
అయితే ఈ నెలాఖరు వరకు దీనిపై కదలిక వచ్చే అవకాశం లేదు. ప్రస్తుత బోర్డు ఛైర్మన్ శ్రీవాత్సవ పదవీవిరమణ చేయనున్నారు. కొత్త ఛైర్మన్ వచ్చిన తర్వాతే దానిపై ముందడుగు పడే అవకాశం ఉంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ల నుంచి బోర్డు ఆదేశాల ప్రకారమే నీటి విడుదల జరగుతున్నాయి.



