తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఈరోజు విజయవాడలో క్షీరాభిషేకం నిర్వహించారు. యాదవ కులస్తులకు రాజ్యసభ సీటు అవకాశం ఇస్తానని ఇటీవల కేసీఆర్ ప్రకటించిన నేపధ్యంలో యాదవ యువభేరి నాయకులు విజయవాడలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
అంతే కాకుండా రాజ్యసభ సీటుకు అభ్యర్థిని ప్రకటించేవరకు ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా క్షీరాభిషేకాలు నిర్వహించి, అభ్యర్థిని ప్రకటించాక అమరావతి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి కేసీఆర్కి కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదం అందిస్తామని వారు ప్రకటించారు. అయితే వీరి చర్యను అంతా వ్యతిరేకిస్తున్నారు.
విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసి రాష్ట్రాన్ని కట్టుబట్టలతో నిలబెట్టిన కేసీఆర్ కు మన నేల మీదనే అభిషేకాలు ఎలా చేస్తారని వారి వాదన. రాష్టం, ఆత్మాభిమానం కంటే కులాభిమానమే ఎక్కువైపోయిందా అని వారు ప్రశ్నిస్తున్నారు.



