తెలంగాణ ఏసీబీ ఫార్ములా 1 రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ సూచించగా, తాను విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత వస్తానని చెప్పి విదేశాలకు బయలుదేరారు.
తెలంగాణ ప్రభుత్వం ఆయనకు నోటీస్ ఇవ్వడాన్ని వివిద కోణాలలో చూడవచ్చు.
· కల్వకుంట్ల కవిత లేఖ, ఆమె విమర్శలతో వారి కుటుంబంలో, పార్టీలో చిచ్చు మొదలవడంతో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. కనుక వారి ఆత్మ స్థైర్యం దెబ్బ తీసి ఆ పార్టీని మరింత బలహీనపరించేందుకు ఇదే తగిన సమయమని కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఈ నోటీస్ ఇచ్చి ఉండవచ్చు.
· కానీ సరిగ్గా ఇదే కారణంగా, బిఆర్ఎస్ పార్టీలో అందరూ భేధాభిప్రాయలు పక్కనపెట్టి ఐకమత్యంగా పోరాడేందుకు సిద్దమయ్యే అవకాశం కూడా ఉంది. కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు తిరుగుతున్నాయంటూ పరోక్షంగా అన్న కేటీఆర్ని విమర్శించిన కల్వకుంట్ల కవిత, ఆయనకు నోటీస్ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించడమే ఓ చిన్న ఉదాహరణ.
· ఈ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేసి జైలుకి పంపబోతున్నామంటూ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పదేపదే చెప్పి చాలా హడావుడి చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ కేసుని అకస్మాత్తుగా అటకెక్కించేసింది. ఏమంటే ఢిల్లీ పెద్దలు అడ్డుపడుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు. ‘ఇదో లొట్టిపిట్ట కేసు దమ్ముంటే తనని అరెస్ట్ చేసుకోమని’ కేటీఆర్ సవాల్ విసిరినప్పటికీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనని అరెస్ట్ చేయలేకపోయింది. కనుక ఇప్పుడీ కేసులో కేటీఆర్కి మళ్ళీ నోటీసులు ఇచ్చి, ఆయనని ఏమీ చేయలేకపోతే తెలంగాణ ప్రభుత్వమే నవ్వుల పాలవుతుంది కదా?
· కల్వకుంట్ల కుటుంబంలో కీచులాటలు జరుగుతున్న ఈ సమయంలో కేటీఆర్కి నోటీసు ఇవ్వడం వలన అందరి దృష్టి వారి కీచులాటలపై నుంచి ఈ కేసుపైకి మళ్ళుతుంది కూడా.
· ఒకవేళ ఈ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే బిఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే మరింత ఉపశమనం కల్పించినట్లవుతుంది కూడా.
కనుక కేటీఆర్కి నోటీస్ ఇవ్వడం, దాని టైమింగ్ రెండూ కూడా తప్పే అనిపిస్తుంది. ఈ నోటీస్ వలన బిఆర్ఎస్ పార్టీ రాజకీయంగా లాభపడబోతుండగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయంగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది.




