రాజకీయాలలో రాణించేవారు రెండు రకాలు. ఒకటి స్వీయ నాయకత్వ లక్షణాలతో రాణించేవారు మరొకరు కాలం, పరిస్థితులు, అదృష్టం కలిసి వచ్చినప్పుడు రాణించేవారు. ఇప్పుడు ఈ చర్చ రెండో కోవకు చెందినవారి గురించి కాదు. కనుక వారు భుజాలు తడుముకోనవసరం లేదు.
ఈ రెండు రకాలుగా కాకుండా మూడో రకం నాయకులు దేశం నిండా కోకొల్లలున్నారు. వారు తమ కంటే ఉన్నత స్థానంలో ఉన్నవారిని నిత్యం విమర్శిస్తూ, దూషిస్తూ తాము కూడా వారి స్థాయి నాయకులమే అని గుడ్డిగా నమ్ముతూ, ప్రజలను కూడా నమ్మించాలని ప్రయత్నిస్తుంటారు.
అయితే ఇలాంటి మూడో రకం నాయకులు ఎదురుదెబ్బలు తింటుంటారు. తెలంగాణలో కేసీఆర్ తిరుగులేని రాజకీయ నాయకుడు. కనుక ఆయన తన పద్దతిలో తెలంగాణని అభివృద్ది చేసుకుంటూ, రాజకీయాలు చేసుకొని ఉంటే నేడు ఈ దుస్థితిలో ఉండేవారు కారు.
కానీ అటు ప్రధాని మోడీని బిజేపిని, ఇటు రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ, ఎద్దేవా చేస్తూ ‘వారి కంటే నేనే చాలా బెటర్’ అనే భ్రమలో దూసుకువెళ్ళి బోర్లా పడ్డారు. మళ్ళీ ఇంతవరకు లేవలేకపోతున్నారు.
అయన బిజేపితో యుద్ధం చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ఉంటే నేడు అయన పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మరోలా ఉండేదనిపిస్తుంది. కానీ అందరిని తక్కువ అంచనా వేసి నష్టపోయారు.
తండ్రి చేసిన పొరపాట్లు, వాటి తీవ్ర పర్యవసానాలను కళ్ళార చూసి, స్వయంగా అనుభవిస్తున్నప్పుడు ఆయన కుమారుడు కేటీఆర్ ఆ తప్పులను పునరావృతం చేయకుండా జాగ్రత్త పడాలి.
కానీ ఆయన కూడా అవే తప్పులు చేస్తున్నారని చెప్పక తప్పదు. అపర చాణక్యుడనుకున్న తన తండ్రిని ఓడించి మూలకూర్చోబెట్టిన సిఎం రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేస్తూ, నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ… తద్వారా ఆయన కంటే నేనే చాలా బెటర్.. సిఎం పదవికి అన్ని విధాల అర్హుడినని గట్టిగా నమ్ముతున్నట్లున్నారు. కానీ ప్రజలు నమ్ముతున్నారో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు.
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కూడా ఇదే ఫార్ములాతో ‘కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలని’ ఆరాటపడుతున్నారు. కనుక నిత్యం ప్రధాని మోడీని విమర్శిస్తూ, ఎద్దేవా చేస్తూ, పిఎం పదవికి తాను అన్ని విధాల అర్హుడినని గట్టిగా నమ్ముతున్నట్లున్నారు. కానీ ప్రజలు నమ్ముతున్నారో లేదో తెలీదు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంశక్తితో అధికారంలోకి వచ్చినవారే. కానీ పదవీ, అధికారం కోల్పోయాక నిత్యం సిఎం చంద్రబాబు నాయుడుని తిట్టని, విమర్శించని రోజే లేదు.
నిజానికి జగన్ ఒకసారి సిఎంగా చేశారు. కనుక తాను సిఎం స్థాయికి చెందిన నాయకుడినని నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు.
ప్రజల మధ్యకు వెళ్ళి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడుతుంటే చాలు. ప్రజలే మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇవ్వొచ్చు.
చివరిగా ఒక్క మాట: తాము ఎంతగానో ఎద్దేవా చేసి, విమర్శిస్తున్న సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముగ్గురూ రాజకీయాలలో ఎలా రాణించారు?మనం కూడా రాణించాలంటే మనలో ఎలాంటి మార్పు చేసుకోవాలి? అని మాత్రం ఆలోచిస్తున్నట్లు లేదు.
కనుక ఇతరులను దూషిస్తూ, ఎద్దేవా చేస్తూ అదే రాజకీయాలు చేయడం… అదే నాయకత్వ లక్షణాలనుకునే నాయకులకు నిరాశా నిస్పృహలు తప్పకపోవచ్చు.






