నాడు సిఎం చంద్రబాబు నాయుడు అమరావతికి శ్రీకారం చుట్టి, పోలవరం పనులు పరుగులు పెట్టిస్తుంటే, తెలంగాణ సిఎం కేసీఆర్ ఆయనను గద్దె దించి తన శిష్యుడు జగన్మోహన్ రెడ్డిని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు.
ఆయన వెంటనే అమరావతి, పోలవరానికి బ్రేకులు వేసి నిలిపేశారు. ఆ తర్వాత మూడు రాజధానులు, సంక్షేమ పధకాలు, రంగులు, రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్న సమయంలోనే, అక్కడ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేవారు.
ఆయన కొడుకు, మంత్రి కేటీఆర్ తెలంగాణకు భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు సాధించుకునేవారు. వాటిలో ఆంధ్రాకు రావాల్సినవి… వచ్చినవి కూడా ఉన్నాయి.
తెలంగాణ అభివృద్ధిని చూసి ఆంధ్రా ప్రజలు బాధ పడలేదు. కానీ ఆంధ్రా పరిస్థితిని చూసి లోలోన కుమిలిపోయేవారు.
ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి లేకుండా పోయిందని బాధపడుతూ, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు నగరాలకు వలసలు పోయేవారు.
కనీసం ఆంధ్రా రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న ఆంద్ర ప్రజలను చూసి, జగన్ ఏలుబడిలో భ్రష్టుపడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి కేసీఆర్, కేటీఆర్ ముసిముసి నవ్వులు నవ్వుకునేవారు.
అవకాశం చిక్కినప్పుడల్లా రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని, మాజీ సిఎం చంద్రబాబు నాయుడుని అవహేళన చేసేవారు. అప్పుడు చంద్రబాబు నాయుడుతో సహా టీడీపి నేతలు, ఆంధ్రా ప్రజలు ఆ అవమానాలను మౌనంగా దిగమింగుకునేవారు.
కానీ నాడు అహంభావం విర్రవీగుతూ చులకనగా మాట్లాడిన బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి ఎదురవడం ఖర్మ ఫలమే అనుకోవాలి.
ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్, కేటీఆర్ ఆశపడితే, ఇటీవల వెయ్యి రోజుల పాలన వేడుక జరుపుకుంది. మరో రెండేళ్ళు అధికారంలోనే ఉంటుంది. బీఆర్ఎస్ నేతలు ఇది జీర్ణించుకోవడం కష్టమే. కనుక వెయ్యి రోజుల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు.
రేవంత్ రెడ్డి మూడేళ్ళ పాలన తెలంగాణ రాష్ట్రం సర్వనాశనమైపోయిందని కేటీఆర్ వాపోయారు. రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయినా అప్పుల భారం నానాటికీ పెరిగిపోతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు పెరిగిపోయాయని కేటీఆర్ ఆరోపించారు.
రేవంత్ రెడ్డి, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి చంచాగా మారి సాగునీటి ప్రాజెక్టులను పాడుబెట్టి రైతులను, వ్యవసాయాన్ని దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు. కృష్ణా గోదావరి నీటిని ఏపీకి వదిలేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. పదేళ్ళ కేసీఆర్ పాలనలో అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి మూడేళ్ళలో భ్రష్టు పట్టించేశారని కేటీఆర్ ఆరోపించారు. ఇంకా చాలా ఆరోపణలు చేశారు.
అంటే నాడు జగన్ హయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏవిధంగా మారిందో ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఆవిధంగా మారిందని కేటీఆర్ చెప్పుకుంటున్నారన్న మాట!
నాడు చంద్రబాబు నాయుడు, టీడీపి నేతలు, ఆంధ్రా ప్రజలు కూడా ఈవిధంగానే బాధపడ్డారు కదా?అయినా ఏనాడూ కేసీఆర్ని పల్లెత్తు మాట అనలేదు. ఆంధ్రా ప్రజల ఉసురే తగిలిందో లేక బీఆర్ఎస్ నేతల కర్మ ఫలమో.. కేసీఆర్ పదవి, అధికారం కోల్పోయారు. కవిత జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. సిఎం అవుతాననుకున్న కేటీఆర్ ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చూసి ఇలా విలపిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ తెలంగాణకు తీరని నష్టం కలిగించారని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్నారు. అందుకే చెడపకురా చెడేవు.. అన్నారు పెద్దలు.
కానీ నేటికీ కేటీఆర్, హరీష్ రావు, కవితల అహంభావం తగ్గనే లేదు. చంద్రబాబు నాయుడుని, ఆంధ్రాని నిందించడం మానుకోవడం లేదు.
ఇక్కడ చంద్రబాబు నాయుడు వెలిగొండ, పోలవరం నుంచి కృష్ణా, గోదావరి నీళ్ళు విడిచిపెడుతుంటే, అక్కడ వారు అక్కసుతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నారు. బహుశః వారు అనుభవించాల్సిన కర్మఫలం ఇంకా మిగిలి ఉన్నందునే ఈవిధంగా మాట్లాడుతున్నారేమో?
ఇది 1000 రోజుల పాలన కాదు,
వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రజా పీడన..!తెలంగాణ రాష్ట్రం మీద దరిద్రం దండయాత్రకు వెయ్యి రోజులు..
కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ఇది ఒక సర్వ భ్రష్ట ప్రభుత్వం
రేవంత్ మాటల్లో ఈ వెయ్యిరోజుల కాంగ్రెస్ పాలన, క్రిమినల్ వేస్ట్..
అబద్ధం, అజ్ఞానం, అవినీతి, అరాచకం… pic.twitter.com/7i9QTDyxIn
— BRS Party (@BRSparty) September 2, 2026





