ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. పోలవరం నుంచి గోదావరి జలాలను అనకాపల్లి వైపు విడుదల చేస్తున్న నేపథ్యంలో దశాబ్దాల కల నెరవేరుతుండటంతో రైతులు, ప్రజలు ఆనందోత్సాహాల్లో ఉన్నారు.
ఇలాంటి సమయంలో పోలవరంలోనే ఏటపాక మండలంలోని గొల్లగుప్పలో చిన్నారుల వరుస మరణాలతో ఏర్పడిన విషాదం ఈ ఆనందాన్ని ఆవిరి చేస్తోంది.
మలేరియా సోకకుండా ముందు జాగ్రత్తగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఇచ్చిన క్లోరోక్విన్ మాత్రలు మింగిన పలువురు చిన్నారులు అస్వస్థతకు గురికావడం, వారిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం.
ఒక సదుద్దేశంతో చేసిన పని ఈవిధంగా వికటించడం.. దాని వల్ల స్థానికులు, ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే పరిస్థితి రావడం మరింత బాధాకరం.
ఈ విషాద ఘటనకు కారణాలు, బాధ్యత ఎవరిదనే అంశాలపై విచారణ తర్వాత ఎలాగూ తెలుస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతూ ‘ఇది పని చేసే ప్రభుత్వం’ అనిపించుకుంటున్న వేళ ఇలాంటి ఘటనలు ‘మంచి ప్రభుత్వానికి’ చెడ్డపేరు తెస్తాయని ప్రజా ప్రతినిధులు, అధికారులు మరిచిపోకూడదు.
ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వైసీపీ కాచుకుని కూర్చున్న పరిస్థితుల్లో ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అభివృద్ధి పనులు ఎన్ని చేసినా, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయంటే ఆ వార్త వేగంగా వ్యాపిస్తుంది. ప్రజల్లో ఆ విషాదం తీవ్ర ఆవేదన కలిగిస్తుంది. దానిని వైసీపీ రగిలించి ప్రభుత్వ వ్యతిరేకతగా మలచడానికి ప్రయత్నించక మానదు.
కనుక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు తమ తమ ప్రాంతాల్లో విద్య, వైద్యం, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక అంశాలపై కూడా నిరంతరం దృష్టి పెట్టాలి. పదవులు, అధికారం, సమాజంలో గౌరవ మర్యాదలు ఆశిస్తున్నప్పుడు అందరూ సమాన బాధ్యత వహించాలి కదా?
అదేవిధంగా అధికారులు, సిబ్బంది కూడా తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుకుంటున్నట్లే.. ప్రజలు కూడా తమ సమస్యలను వారు పరిష్కరించాలని ఆశిస్తుంటారని గ్రహించాలి కదా?
అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ పరిధిలో బాధ్యతగా పనిచేస్తేనే ప్రభుత్వ పనితీరు ప్రజలకు కనిపిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చూసుకోవాలంటే కుదరదు కదా?





