తెలంగాణాలో టిడిపి బ్రతికి బట్టకడుతుందా? ప్రస్తుతం ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే. రోజుకో పేరు హల్చల్ చేస్తుంటే, రెండవ రోజు వారు పార్టీలోకి మారిపోవడం గత కొన్ని రోజులుగా గమనిస్తూ ఉన్న అంశమే. తాజాగా మోత్కుపల్లి పేరు కూడా లైం లైట్ లోకి వచ్చిన మీదట, చివరికి తెలంగాణాలో పార్టీలో ఎవరు మిగులుతారన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
దీనికి సమాధానంగా తొలుత అందరి చూపులు రేవంత్ రెడ్డిపై పడడం సహజమే. పార్టీకి పునర్వైభవం దక్కాలంటే ఒక్క రేవంత్ రెడ్డి వలనే సాధ్యమవుతుందని తెలుగుదేశం కార్యకర్తలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ వ్యక్తమవుతున్న అభిప్రాయం. అలాగే రేవంత్ కూడా టిడిపి తరపున నిర్విరామ పోరాటం చేస్తున్నారు. ఏదో అద్భుతం జరిగితే తప్ప, రేవంత్ టిడిపిని వీడే అవకాశం లేదన్నది ఖచ్చితంగా చెప్పే అంశం. అలాగే ఖమ్మం జిల్లా, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టిడిపి వైపునే గట్టిగా నిలబడ్డారు. తాజాగా గ్రేటర్ పరిధిలో ఉన్న గోపినాధ్ కూడా పార్టీని వీడే అవకాశం లేదని స్పష్టమైన అభిప్రాయం తెలిపారు.
ఇదిలా ఉంటే, తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ పదవి పార్టీకి అతి కీలకంగా మారనుందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే 2/3వ వంతు తమ వైపునే ఉన్నారని, దీంతో పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నామని ఎర్రబెల్లి స్పీకర్ కు రాసిన లేఖ టిడిపిలో కలకలం సృష్టించింది. వీరితో పాటు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రమణ కూడా ‘గులాభీ’ జెండా పట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు దక్కకుండా పోతుందని వ్యక్తమవుతున్న విశ్లేషణలపై తెలుగు తమ్ముళ్లు కలవర పడుతున్నారు.
వాస్తవానికి రమణపై ఇప్పటివరకు ఎటువంటి పుకార్లు గానీ, పార్టీ వీడతారనే అభిప్రాయాలు గానీ వ్యక్తం కాలేదు. అయితే ఎర్రబెల్లి చేసిన విలీన ప్రతిపాదనలకు అధ్యక్షుడి హోదాలో ఉన్న రమణ కూడా జత కడితే కాగల కార్యం గంధర్వులే నిర్వహిస్తారన్నట్లు టిడిపి పరిస్థితి మారుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి ఎల్.రమణే టిడిపికి ‘శ్రీరామరక్ష’ అన్న మాట.



