ప్రజాధరణలో గాంధీల కుటుంబాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వెనక్కి నెట్టి, అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా ఎదిగారు. 19 రాష్ట్రాల్లోని 97 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటర్లలో అత్యంత ప్రజాదరణ పొందిన నేత ఎవరనే విషయమై ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట కార్వీ ఇన్ సైట్స్ భాగస్వామ్యంతో ‘ఇండియా టుడే’ ఓ సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు నిర్వహిస్తే కనుక ఎన్డీఏకే ప్రజలు మళ్లీ పట్టం కడతారని ఆ సర్వేలో తేలింది.
మోడీకి అనుకూలంగా 50 శాతం మంది ప్రజలు మద్దతు తెలపగా, మోడీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి 13 శాతం తక్కువగా మద్దతు లభించింది. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. ఎన్డీఏ సర్కార్ పై వస్తున్న ఆరోపణలు, వ్యతిరేకత వంటి అంశాలు మోడీపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయానని ఈ సర్వే పేర్కొంది.
ఉన్న పళంగా ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ 304 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఎన్డీఏకు చెందిన నాయకులే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సర్వే చెప్పింది. ‘బెస్ట్ పీఎం’ ఎవరనే విషయమై ఆయా రాష్ట్రాల ఓటర్లను ప్రశ్నించగా, మొదటి స్థానంలో ఇందిరాగాంధీ, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అటల్ బిహారి వాజ్ పేయి, నరేంద్ర మోడీ నిలిచారు. ఎన్ని విమర్శలు వ్యక్తం అవుతున్నప్పటికీ మోడీ క్రేజ్ కు ఇది నిదర్శనమని బిజెపి వర్గాలు చెప్పుకుంటున్నాయి.



