క్యాలెండర్లో సంవత్సరాలు మారుతున్నాయి కానీ ఏపీ కి రాజధాని జాడ కానరావడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి మారితే రాష్ట్ర రాజధాని కూడా మారాలి అని ప్రభుత్వ సలహాదారు సలహా ఇచ్చారో ఏమో కానీ జగన్ టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన అమరావతి రాజధానిని కాదని మూడు రాజధానులతో నాలుగున్నరేళ్ల విలువైన కాలాన్ని వృధా చేసారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే ప్రపంచం అంతా కరోనా మహమ్మారితో ఒక్కసారిగా స్తంభించిపోయింది. అయినా ఏపీలో రాజకీయాలు మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. కొన్నాళ్ళకు కరోనాకు వాక్సిన్ వచ్చింది అయినా ఏపీకి రాజధాని రాలేదు. మరి కొన్నాళ్లకు కరోనా ప్రజలకు విముక్తి కల్పించి సెలవు తీసుకుంది. అయినా ఏపీకి రాజధాని తేలలేదు. మళ్ళీ దేశంలో, రాష్ట్రంలో కరోనా కోరలు చాటుతుంది. అయినా ఏపీకి రాజధాని నిర్ణయించలేదు జగన్ సర్కార్.
కరోనా తన రూపాన్ని మార్చుకుంటూ ప్రపంచ యాత్ర చేసి వచ్చినప్పటికీ ఏపీ ప్రజలకు రాష్ట్ర రాజధాని ఏమిటో ఇప్పటికి తెలియలేదు అంటే అది ప్రజల చేతకాని తనమా? లేక ప్రభుత్వ నిర్లక్ష్యమా? అనేది అంతుచిక్కని వైరస్ మాదిరి తయారయ్యింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ మొదలుపెట్టిన ఈ మూడు ముక్కలాటకు ముగింపు పలకడానికి ఈ 5 ఏళ్ళ సమయం సరిపోలేదా అంటూ నిలదీస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు.
చంద్రబాబు హయాంలో 5 ఏళ్ళల్లో రాజధాని నిర్మాణం పూర్తి కాలేదనే ఆక్రోశంతో రాజధాని ప్రాంత వాసులు సైతం టీడీపీ పార్టీని కాదని వైసీపీ పార్టీకి జై కొట్టారు. అయితే జగన్ నిర్మించిన రాజధానిని కాదని తానూ నిర్ణయించిన విశాఖకు రాజధానిని తరలించడానికి కూడా ఐదు సంవత్సరాల సమయం పడితే మరి ఇటు తమ ప్రాంతానికి రాజధాని తీసుకురాలేదని విశాఖ వాసులు అటు తమ ప్రాంతం నుండి రాజధానిని తరలించారని అమరావతి వాసులు వైసీపీ పార్టీకి మద్దతుగా నిలబడతారా..? జగన్ ను నమ్మి ఓటేస్తారా.?
రాజధానిని నిర్మాణాలు పూర్తి చేయడానికే కాదు రాజధానిని తరలించడానికి కూడా ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ సమయమే పడుతుందని జగన్ ఏపీ ప్రజలకు స్పష్టంగా నిరూపించారు.ప్రజలకు ఇప్పటికైనా అర్దమయ్యిందా రాజధాని అంటే ఒక ఐదేళ్ల ఎలక్షణో, ఐదేళ్లలో పూర్తి చేసే ఒక ప్రాజెక్ట్ కాదని.




