మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి ప్రాజెక్ట్ కంఫర్మ్ చేసారు. సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ `లూసీఫర్` తెలుగు రీమేక్ ఆయన చెయ్యనున్నారు. వచ్చేనెల జనవరి 2021 సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్న ఈసినిమాతో తమిళ దర్శకుడు `తనిఒరువన్` (ధృవ) ఫేం మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు.
ఫిబ్రవరి-మార్చి – ఏప్రిల్ లో జరిగే షూటింగ్ తో ఈ 153 వ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక దర్శకుడి విషయానికి వస్తే… మోహన్ రాజా ప్రఖ్యాత ఎడిటర్ మోహన్ వారసుడిగా సుపరిచితం. ఆయన తమిళంలో పాపులర్ డైరెక్టర్. ఐదు తెలుగు సినిమాల్ని తమిళంలోకి రీమేక్ చేసి హిట్ సాధించారు ఆయన.
ఎడిటర్ మోహన్ నిర్మించిన `హిట్లర్` సినిమాకి ముత్యాల సుబ్బయ్య వద్ద మోహన్ రాజా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ రకంగా ఆయనకు గతంలోనే చిరంజీవి తో పరిచయం ఉందట. సీనియర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించనున్నారు. మిగతా విషయాలు జనవరిలో ప్రకటిస్తారు.
ఇది ఇలా ఉండగా… అసలు సినిమా స్క్రిప్ట్ కు పెద్దగా మార్పులు చెయ్యకూడదని మోహన్ రాజా నిర్ణయించుకున్నారని సమాచారం . కాబట్టి, చిరంజీవికి హీరోయిన్ ఉండదు. రొమాంటిక్ ట్రాక్ కూడా చేర్చబడదు. ఇది మెగా అభిమానులకు సరికొత్త ఎక్సపీరియెన్స్ అనే చెప్పుకోవాలి.



