జయలలిత మృతిపై సందేహాలు వ్యక్తం చేస్తూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్ లు ఈ రోజు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు న్యాయమూర్తి కీలక ప్రశ్నలు వేసారు. జయలలిత ఆరోగ్యంపై అంత గోప్యత పాటించాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వ న్యాయవాదిని సూటిగా ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పిన ప్రభుత్వ తరఫు న్యాయవాది… ఇందులో గోప్యత ఏమీ పాటించలేదని చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని న్యాయమూర్తి, జయలలిత మృతిపై మీడియా కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తం చేసిందని అన్నారు.
జయలలిత మృతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జయలలిత మృతదేహాన్ని మళ్లీ పరీక్షించాలని ఎందుకు ఆదేశించకూడదని ప్రశ్నించారు. అయితే హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఈ బాధాకరమని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి అన్నారు. కోర్టుకి అవసరం అనుకుంటే, అమ్మ మృతిపై అనుమానాలు ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకోవచ్చని, జయలలిత చెన్నై అపోలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి రోజు నివేదిక తీసుకుందని చెప్పారు. హైకోర్ట్ చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకం కావడంతో, అన్నాడీఏంకే వర్గాలు వెనువెంటనే స్పందించారు.



