ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మహారాష్ట్ర మహిళా కమిషన్ (ఎంఎస్డబ్ల్యూసీ) మూడోసారి సమన్లు జారీ చేసింది. ‘వివాదాస్పద రేప్’ వ్యాఖ్యల నేపథ్యంలో, తప్పకుండా సల్మాన్ తమ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని పేర్కొంది. జూలై 14న బాంద్రా (ఈస్ట్)లోని కమిషన్ కార్యాలయంలో తప్పకుండా హాజరు కావాల్సిందేనని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.
“సల్మాన్ స్వయంగా హాజరు కాకుంటే చివరికి అతని తరపున ప్రతినిధినైనా పంపించి వివరణ ఇవ్వాల్సిందేనని” ఎస్డబ్ల్యూసీ చైర్ పర్సన్ విజయ రాహత్కర్ పేర్కొన్నారు. గురువారం (జూలై 7వ తేదీ) సాయంత్రం 4 గంటలకు కమిషన్ ఎదుట సల్మాన్ హాజరు కావాల్సి ఉండగా, ఈద్ సందర్భంగా రాకపోవడంతో చివరిసారిగా సమన్లు జారీ చేసింది. గత నెలలో ‘సుల్తాన్’ సినిమా విశేషాలు చెప్తూ సల్మాన్ ఈ వివాదాన్ని నెత్తిన వేసుకున్న విషయం తెలిసిందే.
‘సుల్తాన్’ సినిమా షూటింగ్ సందర్భంగా మల్లయుద్ధం దృశ్యాల చిత్రీకరణ తర్వాత తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితిలా ఉండేదని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో మహిళా సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. మహిళా కమిషన్ రెండుసార్లు సమన్లు జారీ చేసినా ఈ ‘సుల్తాన్’ స్పందించలేదు. దీంతో చివరిసారిగా గురువారం సమన్లతో పాటు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ సారి హాజరు కాకుంటే చట్టపరమైన
చర్యలు తప్పవని హెచ్చరించింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.



