మరో 18 రోజుల్లో సెట్స్ పైకి వెళ్ళబోతున్న మురుగదాస్ సినిమా తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నటించే సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. పూరీ జగన్నాధ్ ఇప్పటికే ‘జనగణమన’ సినిమాను ప్రకటించగా, ప్రిన్స్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ‘బ్రహ్మోత్సవం’ సినిమా దారుణ పరాజయం చవిచూడడంతో, నిర్మాత పివిపికి మరో సినిమా చేయాలని భావించి దర్శకుడు వంశీ పైడిపల్లితో ఒక సినిమా చేయనున్నారనే వార్త ఇటీవల హల్చల్ చేసింది.
ఈ రెండు సినిమాలు ఇలా ఉంటే, అంతకుముందే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమాకు కమిట్ అయ్యారు ప్రిన్స్. దీనిపై కూడా అటు త్రివిక్రమ్, ఇటు మహేష్ ల నుండి ఒక ప్రకటన వెలువడింది. మరి ఎవరితో జత కడతారు అన్న విషయం క్లారిటీ రాకముందే లైన్ లోకి మరో దర్శకుడు వచ్చి చేరారు. ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో దారుణ పరాజయాన్ని చవిచూడడం, ప్రస్తుతం సెట్స్ కెళ్లబోయేది తమిళ దర్శకుడు సినిమా కావడంతో… నెక్స్ట్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సేఫ్ జోన్ లో ఉండాలని భావించి తనకు ‘శ్రీమంతుడు’ వంటి సినిమాను అందించిన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేయడానికి ప్రిన్స్ సిద్ధమయ్యారనే టాక్ వెలువడుతోంది.
మురుగదాస్ సినిమా పూర్తి కాగానే, కొరటాల సినిమాను జనవరి, ఫిబ్రవరిలలో సెట్స్ పైకి వెళ్ళే విధంగా ప్రణాళికలు జరుగుతున్నాయని, ప్రముఖ దర్శకుడు డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తపై ప్రిన్స్ అభిమానుల నుండి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాంత్ అడ్డాలతో ప్రిన్స్ చేసిన రెండవ సినిమా ‘బ్రహ్మోత్సవం’ ఫలితం రీత్యా, కొరటాల శివతో రెండో సినిమా అంటే భయపడుతున్నారు. అయితే ఇలాంటి సెంటిమెంట్లకు ప్రిన్స్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు గనుక, ఎంచుకున్న కధపై దృష్టి పెడితే సరిపోతుందన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. అయితే కొరటాలతో ప్రాజెక్ట్ ముందుకెళితే ప్రిన్స్ తో సినిమా కోసం వేచిచూస్తున్న పూరీ, త్రివిక్రమ్, వంశీలకు పెద్ద షాక్ ఇచ్చినట్లే!



