ఒక క్రేజీ కాంబినేషన్ మీద అంచనాల బరువు చాలా విపరీతంగా ఉంటుంది. దాన్ని అందుకోవడం అంత సులభం కాదు. అత్తారింటికి దారేది కాంబో అనే ప్రచారం అజ్ఞాతవాసి ఓపెనింగ్స్ కి ఎంత మేలు చేసిందో అంత చేటూ తీసుకొచ్చింది. కంటెంట్ బాలేకపోవడం తర్వాతి విషయం.
అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సహజంగానే త్రివిక్రమ్ గుంటూరు కారం మీద విపరీతమైన హైప్ వచ్చేసింది. టైటిల్ ఎప్పుడో లీకైనా వేరే ఆప్షన్లు చాలా చూసి చివరికి దీనికే ఫిక్స్ అయ్యారు. భారీ హంగామాతో టీజర్ వదిలేశారు.
షూటింగ్ చేసిందే కొంత భాగం కాబట్టి త్రివిక్రమ్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ రూటు పట్టి ఉన్న కాసిన్ని షాట్లతో అభిమానులకు నచ్చేలా కట్ చేయించాడు. సరే ఇది కాసేపు పక్కనపెడితే కారంలో అన్ని రుచులు ఉండాల్సిందే అనే రేంజ్ లో ఫ్యాన్స్ అంతకంతా దీని మీద నమ్మకం పెంచుకుంటున్నారు.
మహేష్ ఒకప్పటి మాస్ స్టామినా గత కొన్నేళ్లుగా బయట పడటం లేదు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు కమర్షియల్ గా ఎంత సక్సెస్ అయినా ఒక్కడు, పోకిరి నాటి హై ఇవ్వలేదన్నది అందరూ ఒప్పుకునే వాస్తవం.
ఆ లోటుని తీర్చే బాధ్యత త్రివిక్రమ్ మీద ఉంది. పైగా మహేష్ తో చేసిన గత రెండు సినిమాల్లో అతడు బుల్లితెరపై బ్లాక్ బస్టరే కానీ థియేటర్స్ లో సూపర్ హిట్ దగ్గరే ఆగిపోయింది. ఖలేజా ఇప్పుడెంత కల్ట్ క్లాసిక్ అని మెచ్చుకున్నా రిలీజ్ టైంలో వచ్చిన నష్టాలు నిర్మాతను కుదిపేసిన మాట అబద్దం కాదు. సో ఆ లోటుని పూర్తిగా భర్తీ చేయాలంటే గుంటూరు కారంని ఆయుధంగా వాడుకోవాలి. సూపర్ స్టార్ కి సరైన మాస్ యుఫొరియా పడితే రికార్డులు ఏ రేంజ్ లో ఎగురుతాయో చూడాలని బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూస్తున్నారు
ఇంతేకాదు త్రివిక్రమ్ మరో నిందను తొలగించుకోవాల్సి ఉంటుంది. గుంటూరు కారం షూటింగ్ మొదట్లో వచ్చిన అవాంతరాలు, స్క్రిప్ట్ మీద ప్రచారాలు వీటికి ఫలితం రూపంలో సమాధానం చెప్పాలి.
ఇది ఓకే అయ్యాకే హఠాత్తుగా భీమ్లా నాయక్, బ్రో పనులు చూసుకోవడం, పవన్ కళ్యాణ్ కు వేరే ప్రాజెక్టులు సెట్ చేయడం వల్లే మహేష్ 28 మీద ఫోకస్ తగ్గిందనే వార్తలు గట్టిగానే తిరిగాయి.
సాలిడ్ బ్లాక్ బస్టర్ పడితే ఇవన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.సో గుంటూరు కారంలో తీపి చేదు వగరు పులుపు అన్నీ సరైన మోతాదులో పడాల్సిందే. అదే సగటు అభిమాని కోరిక కూడా.



