ఈ శుక్రవారం నాడు రెండు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ రెండు సినిమాల ద్వారా టాలీవుడ్ కు ఇద్దరు కొత్త దర్శకులు పరిచయం అవుతున్నారు. అందులో ఒకరు… ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న సూపర్ స్టార్ కృష్ణ తనయురాలు (షో ఫేం) మంజుల కాగా, మరొకరు ఇప్పటివరకు ప్రేక్షకులకు ఆస్సలు తెలియని ప్రశాంత్ వర్మ. మరి ఈ ఇద్దరు దర్శకుల సినిమాలకు ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇచ్చారు? ఈ శుక్రవారం వారికి ఎలాంటి అనుభూతులను మిగిల్చింది? అంటే… ఒకరికి ‘స్వీట్,’ మరొకరి ‘హాట్’ అనిపించేలా ‘ఫస్ట్ టాక్స్’ బయటకు వచ్చినట్లుగా సమాచారం.
తొలుత నాని నిర్మాతగా మారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన “అ!” సినిమా పరిశీలిస్తే… విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీగా ఇప్పటికే పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా ముందుగా లాభపడింది ఎవరు అంటే… దర్శకుడు ప్రశాంత్ వర్మ అనే చెప్పాలి. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ వంగాకు ఎంత పేరయితే వచ్చిందో, ఈ సినిమా తర్వాత ఆ స్థాయిలో ప్రశాంత వర్మ పేరు వినిపించే విధంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ధన రూపేణా నిర్మాతగా నాని లాభపడవచ్చేమో గానీ, కీర్తిప్రతిష్టతలలో మాత్రం ప్రశాంత్ వర్మ పేరు ప్రధానంగా వినపడుతోంది. అంత మంచి అనుభూతులను “అ!” పంచుతోంది.
ఇక మహేష్ బాబు సోదరిమణిగా మంజుల దర్శకత్వం వహించిన “మనసుకు నచ్చింది” సినిమా ప్రేక్షకుల మనసుకు నచ్చడం కష్టమేమో అన్న ‘ఫస్ట్ టాక్’ వినపడుతోంది. సేఫ్ జోన్ గా ప్రేమకధను ఎంపిక చేసుకున్నప్పటికీ, బోరింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయన్న టాక్ తో, ఆశించిన పేరుప్రఖ్యాతలను సొంతం చేసుకోవడంలో మంజుల విఫలమైందన్న టాక్ హల్చల్ చేస్తోంది. లొకేషన్ల ఎంపిక, ఫోటోగ్రఫీ విషయంలో మంచి మార్కులే పడినా, మంజులకు విమర్శకుల ప్రశంసలు లభించడం మాత్రం అత్యాశే అని తెలుస్తోంది. కొత్తదనంతో ప్రశాంత్ వర్మ డామినేట్ చేయగా, రొటీన్ కొట్టుడుతో మంజుల ఆకట్టుకోలేకపోయారనేది ఫైనల్ టాక్.



