‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ సినిమాతో హీరోగా మారిన నాటి నుండి ఇప్పటివరకు అనేక సక్సెస్, ఫెయిల్యూర్స్ ను చవిచూసాడు రవితేజ. అయితే ఫలితాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఏడాదికి రెండు, మూడు సినిమాలను విడుదల చేస్తూ ఒకానొక సమయంలో అగ్ర హీరోలకే వణుకు పుట్టించాడు. కానీ, ప్రస్తుతం రవితేజ ఎందుకు బ్రేక్ తీసుకున్నారన్నది మాత్రం అభిమానులను అర్ధం కాని ప్రశ్నగా మారింది.
చాలా సంవత్సరాల పాటు ఫ్లాప్ లను చవిచూసిన తర్వాత ‘బలుపు’ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకుని, మళ్ళీ లైంలైట్ లోకి వచ్చిన ఈ మాస్ మహారాజ్, ఆ తర్వాత ‘పవర్’తోనూ అదే స్థాయిని అందుకున్నారు. ‘కిక్ 2’ తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ, గతేడాది ‘బెంగాల్ టైగర్’ ద్వారా మరో కమర్షియల్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. వెండితెరపై విమర్శకులు మెచ్చే అభినయం ప్రదర్శించినా, లేకున్నా, తనదైన రీతిలో ఎప్పుడూ సినిమాలతో కళకళలాడే రవితేజ గత తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉంటున్నారు.
ప్రముఖ దిల్ రాజుతో సినిమా అని ప్రకటించినప్పటికీ, దానికి ఆదిలోనే ‘శుభంకార్డు’ పడిపోయింది. అయితే తాజా సమాచారం మేరకు తనకు ‘పవర్’ వంటి పవర్ ఫుల్ సినిమాను ఇచ్చిన బాబీతోనే మరో సినిమాకు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే విక్రమ్-దీపక్ జంట దర్శకులను పరిచయం చేస్తూ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. కాస్త లేట్ అయినప్పటికీ, ఈ రెండు సినిమాలను ఏకకాలంలో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారన్నది అభిమానులకు ఊరటనిచ్చే విషయం. అయితే వీటిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.



