తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి తన స్వరాష్ట్రం మధ్యప్రదేశ్లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె రాజ్యసభ సీటుకి నామినేషన్ వేయాగా, ఓ లీగల్ నోటీస్ గురించి అఫిడవిట్లో పేర్కొలేదంటూ ఈసీ ఆమె నామినేషన్ తిరస్కరించింది.
అనంతరం ఆమె హైదరాబాద్ తిరిగి వచ్చి గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలున్నారు. కనుకనే మా అధిష్టానం నాకు ఆ సీటు కేటాయించింది. కానీ బిజేపి ఎన్నికల సంఘంపై ఒత్తిడి చేసి కుంటి సాకుతో నా నామినేషన్ తిరస్కరించేలా చేసింది.
రాజకీయాలలో ఉన్నవారికి లీగల్ నోటీస్ వస్తే అది నేరం చేసినట్లు కాదు. కానీ ఆ నోటీస్ని సాకుగా చూపి నా నామినేషన్ తిరస్కరించడం చాలా బాధాకరం. ఎన్నికల సంఘం ఈవిధంగా రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి పనిచేస్తూ ప్రజాస్వామ్య స్పూర్తిని దెబ్బ తీస్తోంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసి బిజేపి అభ్యర్ధికి ఓట్లు వేయరని గ్రహించినందునే ఈవిధంగా చేశారు. నేను మధ్యప్రదేశ్కి చెందిన రాజకీయ నేతను కనుక అక్కడి నుంచే పోటీ చేయాలనుకున్నాను. ఇక్కడ (తెలంగాణలో) నా కోసం ఎవరి చేతో రాజీనామా చేయించి ఆ సీటు తీసుకోవాలని నేను కోరుకోవడం లేదు,” అని మీనాక్షి నటరాజన్ అన్నారు.
ఆమె ఆరోపణ సహేతుకమే అయితే ఆమె విషయంలో బిజేపి, ఎన్నికల సంఘం రెండూ అత్యుత్సాహం ప్రదర్శించాయని చెప్పక తప్పదు. ఇటువంటి పోకడలు ప్రజాస్వామ్యాన్ని క్రమంగా బలహీనపరిచి మళ్ళీ ఫ్యూడల్ వ్యవస్థ నెలకొనేలా చేస్తాయి.




