మెగాస్టార్ చిరంజీవిని మనం అవమానిస్తే…

Mega Celebrations

మెగాస్టార్ చిరంజీవికి అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించినప్పటి నుంచి ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమలోవారు ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కోడలు, రామ్ చరణ్‌ సతీమణి ఉపాసనా కొణిదెల శనివారం రాత్రి హైదరాబాద్‌లో విందు ఏర్పాటు చేసి సినీ,రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.

ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, శ్రీధర్ బాబు ఇంకా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ADVERTISEMENT

సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు చిరంజీవిని ఆప్యాయంగా కౌగలించుకుని అభినందించారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు రావడం తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణమేనని సిఎం రేవంత్‌ రెడ్డి చిరంజీవిపై ప్రశంశల వర్షం కురిపించారు.

చిరంజీవి సిఎం రేవంత్‌ రెడ్డికి కేక్ తినిపించగా, ఆయన కూడా ఆప్యాయంగా చిరంజీవికి కేక్ తినిపించారు. తర్వాత సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, చిరంజీవి, రామ్ చరణ్‌ కుటుంబ సభ్యులతో కొంతసేపు సరదాగా మాట్లాడుకున్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి విందుకు వచ్చినందుకు చిరంజీవి కుటుంబ సభ్యులు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

ఇదంతా వింటున్నప్పుడు ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి, ఆయన ప్రభుత్వం చిరంజీవితో ఏవిదంగా ప్రవర్తించిందో గుర్తు రాకమానదు.

మనం చిరంజీవిని తాడేపల్లి ప్యాలస్‌కు రప్పించుకుని చేతులు జోడించి అర్ధించేలా చేస్తే, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన మంత్రులను వెంటబెట్టుకుని చిరంజీవి ఇంటికి వెళ్ళి వారి విందు స్వీకరించారు!చిరంజీవిని మనం అవమానిస్తే వారు ఆయనను అభినందిస్తున్నారు.

‘చిరంజీవి మావాడు… ఈ అవార్డు మాకు గర్వకారణమని’ మనం చెప్పుకోవలసి ఉండగా, ఆ మాట తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు. ఇందుకు మనం సంతోషించాలా బాధపడాలా?

ADVERTISEMENT
Latest Stories