నేడు కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి వేణుగోపాల్ కృష్ణ ఆధ్వర్యంలో సిఎం ‘జగన్ సురక్ష’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనకు, పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులకు మద్య విభేధాలు మరోసారి బయటపడ్డాయి.
ఈ కార్యక్రమంలో మంత్రి వేణు అనుచరుడు ఉదయ్ ఆయన ఎదుటే పిల్లి వర్గానికి చెందిన మునిసిపల్ వైస్ ఛైర్మన్ శివాజీపై చెయ్యి చేసుకొన్నాడు. దీంతో అవమానం భరించలేక శివాజీ చీమల మందు త్రాగేశారు. ఆయన అనుచరులు వెంటనే సమీపంలో ఆసుపత్రికి తరలించి శివాజీకి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇంత జరిగినా మంత్రి వేణు అసలేమీ జరగన్నట్లు అక్కడి నుంచి వెళ్లిపోవడం విశేషం.
గత కొంతకాలంగా మంత్రి వేణుకి, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మద్య కోల్డ్ వార్ సాగుతోంది. ఆదివారం పిల్లి సుభాష్ బోస్ అనుచరులు సమావేశం పెట్టుకొని, వచ్చే ఎన్నికలలో పిల్లి కుమారుడు సూర్య ప్రకాష్కే టికెట్, మద్దతు ఇవ్వాలనితీర్మానించారు.
తమకు వేణు ఎవరో కూడా తెలీదని, గత ఎన్నికలలో పిల్లి సుభాష్ చంద్రబోస్ చెపితేనే అందరం వేణు కోసం పనిచేసి ఎన్నికలలో గెలిపించామని, కానీ మంత్రి అయిన తర్వాత తమ మీదే పోలీస్ కేసులు పెట్టిస్తూ వేధిస్తున్నారని సూర్య ప్రకాష్ ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా అధికారిక కార్యక్రమంలో మంత్రి వేణు తన అనుచరుడితో మునిసిపల్ వైస్ ఛైర్మన్ శివాజీపై దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న జరిగిన సమావేశంలో శివాజీ కూడా పాల్గొన్నందునే ఆయనపై మంత్రి తన అనుచరుడి చేత దాడి చేయించారని సూర్య ప్రకాష్ ఆరోపించారు. సొంత పార్టీ నేతలపైనే పోలీసు కేసులు పెట్టిస్తూ, ప్రజలందరి ముందు ఈవిదంగా అవమానిస్తున్న మంత్రి వేణుకి తాము ఎందుకు మద్దతు ఇవ్వాలని సూర్య ప్రకాష్ ప్రశ్నించారు. తాము ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళతామని చెప్పారు.
పిల్లి సుభాష్ చంద్రబోస్ వచ్చే ఎన్నికలలో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి తన కుమారుడు సూర్య ప్రకాష్కి టికెట్ ఇవ్వాలని కోరుతూ నియోజకవర్గంలో చురుకుగా పనిచేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో మళ్ళీ తానే నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నానని మంత్రి వేణు గట్టిగా చెపుతున్నారు. ఈ కారణంగా ఇరువర్గాల మద్య జరుగుతున్న గొడవలు ఇవాళ్ళ బహిరంగంగా దాడి చేసుకొనేవరకు వచ్చింది. అంటే ‘జగన్ సురక్ష’ కాదు… ‘జగన్ పంచాయితీ’ టైమ్ అయ్యిందన్న మాట!



