కాకినాడలో దళిత వర్గానికి చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అనంతబాబు తరపున అతని న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ ఇచ్చేందుకు ఎటువంటి బలమైన కారణాలు లేనందున అనంతబాబుకి బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తి ఎం.నాగేశ్వరరావు తెలిపారు.
వైసీపీ అనంతబాబును పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు అతనికి మద్దతు ఇస్తూనే ఉన్నారు. ఇటీవల రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి అధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో ఇందుకూరుపేటలో నిర్వహించిన గడపగడపకు కార్యక్రమంలో అనంత బాబు అనుచరులు కూడా పాల్గొన్నారు. వారు ‘అనంతబాబు జిందాబాద్…’ అని నినాదాలు చేస్తూ ఆర్అండ్బీ ప్రధాన రహదారిపై అతని చిత్ర పఠంతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అతని చిత్ర పఠానికి పాలాభిషేకం చేశారు.
దీనిని బట్టి అనంతబాబుకి వైసీపీ మద్దతు కొనసాగుతోందని స్పష్టమవుతోంది. అతను జైల్లో ఉండగానే, అతని పేరిట ర్యాలీ జరిపి అతని చిత్ర పఠానికి పాలాభిషేకాలు చేయడం గమనిస్తే అతను ఎంత శక్తివంతుడో అర్దమవుతోంది. కనుక రాజకీయ అండదండలున్న అనంతబాబుకి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసి కేసు నీరుగార్చే ప్రమాదం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ హత్య కేసులో అతనికి సహకరించినవారిని కూడా పోలీసులు అరెస్ట్ చేయాలని లేకుంటే వారి వలన సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకి, ప్రత్యక్ష సాక్షులకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు.



