పశ్చిమబెంగాల్ లో బీజేపీ గెలుపు తరువాత మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ నే అంటూ ప్రధాని నరేంద్ర మోడీ బహింరంగంగానే ప్రకటించారు. ఇది ఒకరకంగా ప్రత్యర్థి పార్టీలకు హెచ్చరిక కాగా మరోరకంగా సొంత పార్టీ నేతలకు ఆదేశాలుగా చెప్పొచ్చు.
టి. బీజేపీ లో బలమైన రాజకీయ నేతలకు కొదవు లేదు. పార్టీ స్టాండ్ ని బలంగా వినిపించే బండి సంజయ్ వంటి డేరింగ్ లీడర్ ఉన్నారు, ప్రత్యర్థి పార్టీలకు సైలెంట్ కిల్లర్ వంటి కిషన్ రెడ్డి ఉన్నారు, ఇక పార్టీ తరుపున ప్రత్యర్థి పార్టీల నేతల పై వారి విధి విధానాల పై నోరేసుకుపడిపోయే అర్వింద్ వంటి పార్టీ గొంతు వినిపించే బలమైన నాయకులు ఉన్నారు.
ఇక కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన డీకే అరుణ వంటి సీనియర్ నేత ఉన్నారు, అలాగే తెలంగాణ రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన మాజీ బిఆర్ఎస్ మంత్రి ఈటెల రాజేంద్ర ప్రసాద్ వంటి క్షేత్ర స్థాయిలో ప్రజా బలమున్న నాయకుడు ఉన్నాడు.
అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఇంతమంది పేరు పొందిన, ప్రజల మద్దతు సంపాధించిన బలమైన నాయకులు ఉన్నప్పటికీ టి. బీజేపీ ఇప్పటికి నాయకత్వ లోపంతో ఎదగలేకపోతుంది వై.? అన్న ప్రశ్నకు పార్టీ నేతల మధ్య ఉండే అంతర్గత రాజకీయాలే ప్రధాన కారణం అనేది బీజేపీ అధిష్టానానికి కూడా ఎరుకే.
పార్టీ నేతల మధ్య ఇప్పటికి రాజకీయంగా సఖ్యత ఏర్పడకపోవడం, ఎవరికీ వారే యమునా తీరే అన్నచందంగా నడుచుకోవడం, రాజకీయ ఆధిపత్యం కోసం ఆరాటపడడం టి. బీజేపీ లో కనిపించే ముఖ్యమైన లోపాలు. వాటిని సరిచేసేందుకు బీజేపీ అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది బీజేపీ అగ్రనేతలు తెలంగాణ పర్యటనలు సాగించినా క్షేత్ర స్థాయిలో వాటి ప్రభావం శూన్యమనే చెప్పాలి.
ఇటువంటి లోపాలతో మోడీ ఆశించినట్టుగా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనే నినాదంతో టి. బీజేపీ నేతలు అందరు ఏకతాటి మీదకొచ్చి తెలంగాణలో రాజ్యాధికారం సాధించగలుగుతారా.?




