టీటీడీ కొత్త ఈవోగా ఉత్తరాది అనిల్ కుమార్ సింఘాల్ నియామకంపై ఏపీ అధికార ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీంతో ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యత దక్కించుకుని పెద్ద చర్చే జరగగా, తాజాగా ఇదే అంశంలో విలక్షణ నటుడు ‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు స్పందించారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా తెలుగుదేశం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ… ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నిర్ణయాన్ని స్వాగతించారు.
తెలుగు రాష్ట్రాలలో కలెక్టర్ గా విధులు నిర్వహించిన అనుభవం అనిల్ కుమార్ సింఘాల్ సొంతమని, అంతేకాక అనిల్ చాలా నిజాయితీ పరుడని, అంకిత భావం కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు మోహన్ బాబు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ కు తన పూర్తి మద్దతు, సంపూర్ణ సహకారం ఉంటుందని మోహన్ బాబు తెలిపారు. త్వరలో మోహన్ బాబు కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్న నేపధ్యంలో… ఈ రాజకీయ అంశంపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను దక్కించుకున్నాయి.
అయితే కొత్త ఈవోగా అనిల్ కుమార్ నియామకం జరిగిపోయింది గనుక, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విభేదించి లాభం లేదని, అందుకే మోహన్ బాబు సమర్ధించి ఉంటారని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. అయినా సెలబ్రిటీలు కావడం, అందులోనూ తిరుపతిలో విశ్వవిద్యాలయాన్ని రన్ చేస్తున్న మోహన్ బాబుకు, సహజంగా ఎప్పుడూ ఈవో స్థాయి అధికారులతో ఏదొక కీలక కార్యక్రమాలు ఉంటాయి గనుక, వీరి నియామకాన్ని విభేదించడం కన్నా, మద్ధతివ్వడమే మేలనుకుని భావించి ఉంటారనేది ట్రేడ్ టాక్.



