ఒకప్పుడు టిడిపి పొలిట్ బ్యూరోలో సభ్యుడుగా ఉన్న తెలంగాణ దళిత నాయకుడు మోత్కుపల్లి నరసింహులు, టిడిపిని బిఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలంటూ ఉచిత సలహా ఇచ్చినందుకు పార్టీ నుంచి బహిష్కరింపబడ్డారు. ఆ తర్వాత కేసీఆర్ పిలుపుతో మోత్కుపల్లి చాలా సంతోషంగా బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ కేసీఆర్ తనను పులిహోరలో కరివేపాకులా వాడుకోవడానికే తప్ప పదవులు, టికెట్ ఇవ్వడానికి కాదని గుర్తించడంతో మోత్కుపల్లి ఆయనపై బాణాలు సందించడం మొదలుపెట్టారు.
శనివారం హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి, “కేసీఆర్ నువ్వు దళితబంధు అని మాయ మాటలు చెప్పావే కానీ కనీసం 10 శాతం మందికి కూడా ఇవ్వలేకపోయావు. దానికోటి దిక్కులేదు కానీ మళ్ళీ గిరిజనబంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు అంటూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలని మోసం చేస్తున్నావు. ఓట్ల కోసం ప్రజలను ఈవిదంగా మోసం చేయడం తగునా నీకు? ప్రజలని మోసం చేసి ఆస్తులు పోగేసుకొంటున్నందుకు తెలంగాణ ప్రజలు ఎలాగూ ఈసారి నిన్ను గద్దె దించబోతున్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించకపోగా, ఆంద్రోళ్ళ పంచాయితీలు ఇక్కడ కుదరదని చెప్పావు. దీంతో నువ్వు మరో 30 సీట్లు పోగొట్టుకొన్నావనే సంగతి గ్రహించావా? చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో నీ మౌనం, నీ వైఖరి చూసి హైదరాబాద్, తెలంగాణ జిల్లాలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లు కూడా నీకు ఈసారి బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు.
అలాగే అక్కడ ఏపీలో ప్రజలు కూడా చంద్రబాబు నాయుడుని జైల్లో వేసినందుకు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి ఇంటికి పంపించేందుకు సిద్దంగా ఉన్నారు. అధికార మదంతో మిడిసిపడుతున్న మీ ఇద్దరికీ ప్రజలే బుద్ధి చెప్పబోతున్నారు. ముందు కేసీఆర్కి తర్వాత జగన్ వంతు వస్తుంది,” అని మోత్కుపల్లి అన్నారు.
మోత్కుపల్లి కేసీఆర్, జగన్ల గురించి ఏ ఉద్దేశ్యంతో మాట్లాడినప్పటికీ, చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో మౌనంగా ఉండిపోయి పరోక్షంగా జగన్ నిర్ణయానికి మద్దతు తెలుపుతునందుకు హైదరాబాద్లో ఏపీ ఓటర్లకు కేసీఆర్ పట్ల ఆగ్రహం కలగడం సహజమే. అది ఎన్నికలలో ప్రభావం చూపడం ఖాయమే.
ఏపీలో ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు చేసినందుకు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహంగానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారో లేదా అని కాకుండా రాష్ట్రాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని మాత్రమే చూస్తుంటారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరి తీరుని, పాలనను, రాష్ట్రంలో పరిస్థితులను బేరీజు వేసుకొని చూస్తూనే ఉన్నారు.
కనుక చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినందుకు వారు వైసీపికి వ్యతిరేకంగా ఓట్లు వేయడం ఖాయమే. ఒకవేళ ఆలోగా టిడిపి, జనసేనలు మరింత దగ్గరై, సీట్ల సర్దుబాట్లు చేసుకొని ప్రజలను ఆకర్షించగలిగితే వాటి చేతిలో వైసీపి ఓటమి ఖాయం అవుతుంది.




