పెద్ద సినిమా విడుదలవుతుంటే టికెట్ ఛార్జీల పెంపు, ప్రీమియర్ షోలు, ప్రత్యేక షోల విషయంలో జరుగుతున్న రాద్దాంతం చూస్తూనే ఉన్నాము. దీని కోసం హైకోర్టుకి కూడా వెళ్ళాల్సివస్తోంది. ఈ వ్యవహారంలో ఇటు చిత్ర నిర్మాణ సంస్థ, అటు ప్రభుత్వం కూడా అప్రదిష్టపాలవుతున్నాయి.
టికెట్ ఛార్జీలకు, అదనపు షోలకు ప్రభుత్వం అనుమతించినా, అనుమతించకపోయినా రాజకీయ విమర్శలు తప్పడం లేదు. అనుమతిస్తే కాకులను కొట్టి గద్దలకు పెడుతోందని విమర్శిస్తారు. లేకుంటే రాజకీయ కక్షతోనే అనుమతించలేదని విమర్శిస్తారు. రాజసాబ్ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంలో ఆలస్యం చేసింది. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ విమర్శలు తప్పవు కదా?
ప్రభుత్వాలు ఇటువంటి తలనొప్పులు ఎదుర్కొంటుంటే, పెద్ద సినిమా నిర్మాతలు, పెద్ద హీరోలు మరో రకం సమస్య ఎదుర్కొంటున్నారు.
టికెట్ ఛార్జీలు పెంచాలన్న ప్రతీసారి, మీ హీరోలు, దర్శకులు పారితోషికాలు తగ్గించుకుంటే బడ్జెట్ తగ్గుతుంది కదా? టికెట్ ఛార్జీలు పెంచకుండానే చిన్న సినిమాలు సూపర్ హిట్ అయ్యి లాభాలు ఆర్జిస్తున్నప్పుడు, మీరెందుకు అలా చేయడం లేదు?
అయినా ఇంత భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీయమని మిమ్మల్ని ఎవరైనా అడిగారా?భారీ బడ్జెట్తో సినిమాలు తీయడం దేనికి? ఇలా ప్రతీసారి టికెట్ ఛార్జీలు పెంచాలంటూ ప్రభుత్వాలను అడుక్కోవడం దేనికి? ప్రజలను, ముఖ్యంగా అభిమానులను దోచుకోవడం తప్పు కాదా? అనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ అభ్యర్ధన కారణంగా పెద్ద సినిమాలను, వాటి నిర్మాతలను, హీరోలను ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు శాశించగలుగుతున్నారు. తమ ముందు మోకరిల్లేలా చేసుకోగలుగుతున్నారు.
కనుక పారితోషికాలు, ఖర్చులు తగ్గించుకొని ఇటువంటి రాయితీలు కోరకుండా హాయిగా సినిమాలు రిలీజ్ చేసుకోవడమే ఉత్తమం కదా? సినీ పరిశ్రమ ఆలోచిస్తే మంచిది.






