ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక్కోసారి అనుకోకుండా చేసే కొన్ని పనులు ఎంతటి చిక్కులను తెచ్చిపెడతాయో అని చెప్పడానికి ఉదాహరణే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉదంతం. ఇటీవల యూఏఈ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ‘బాహుబలి-2’ మరియు ‘నిరుత్తర’ చిత్రాలను ఒకే రోజు వీక్షించిన సిద్ధరామయ్య, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ నటించిన ‘రాజకుమార’ చిత్రాన్ని కూడా ఇటీవల తిలకించారు. ఈ సినిమాకు హాజరైన సందర్భంలోని ఓ ఫోటోని, సీఎంఓ కార్యాలయ సిబ్బంది సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.
అయితే ఈ ఫోటో పెట్టడమే ముఖ్యమంత్రి వర్యులకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఈ ఉదంతం తర్వాత కన్నడ ఇండస్ట్రీలోని ఇతర నిర్మాతల నుండి తీవ్ర ఒత్తిడిలు వస్తున్నాయట. ప్రతి నిర్మాత తమ సినిమా చూడాలంటే తమ సినిమా చూడాలని సిద్ధరామయ్యను ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయానికి, నివాస పరిసర ప్రాంతాలలో రాజకీయ నాయకులు, ప్రజల కంటే కూడా సినీ నిర్మాతలు ఎక్కువగా కనపడుతున్నారని పార్టీ నేతలు వాపోతున్నారు.
అయితే దీనికి తెరదించే క్రమంలో స్పందించిన సిద్ధరామయ్య… కాలేజీ రోజుల్లో తాను తరచుగా సినిమాలు చూస్తుండే వాడినని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలను చూడడానికి అస్సలు తనకు తీరిక ఉండటం లేదని చెప్పారు. పనుల నిమిత్తం బిజీగా ఉన్న తాను, ఎప్పుడు పడితే అప్పుడు సినిమాలు చూడటం కుదరదని, తమ సినిమాలు చూడాలని తనను ఆహ్వానిస్తున్న నిర్మాతలకు ధన్యావాదాలు చెప్పి పంపిస్తున్నారు. అయితే సినిమాలు చూసామని డప్పు కొట్టుకోవడం ఎందుకు… ఇప్పుడు తిప్పలు పడడం ఎందుకు..!



