ఈ సీజన్లో మహేంద్ర సింగ్ ధోని ప్రాతినిధ్యం వహిస్తున్న రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ జట్టు పేలవమైన ఆట తీరుతో పాయింట్స్ పట్టికలో దిగువ స్థానంలో నిలిచింది. భారీ స్కోర్లను సాధిస్తున్నా, వాటిని విజయం దిశగా మలుచుకోవడంలో టీం దారుణంగా ఫెయిల్యూర్ కావడంతో ధోని అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ నుండి దాదాపుగా అవుట్ అనుకున్న తరుణంలో తాజాగా ఢిల్లీ డేర్ డెవిల్స్ పై విక్టరీ అందుకుని… ప్లే ఆఫ్స్ ఆశలు చిగురింప చేసుకుంది.
ఈ విజయంతో ఆడిన 9 మ్యాచ్ లలో 3 విజయాలు, 6 ఓటములతో పాయింట్ల పట్టికలో 6 వ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగిలిన 5 మ్యాచ్ లలోనూ ధోని టీం ఖచ్చితంగా విజయం సాధించాల్సిందే. దాదాపుగా ఇది అసాధ్యమైన అంశమే అయినా… క్రికెట్ లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు గనుక… ఒక్కో విజయాన్ని నమోదు చేసుకుంటూ వెళితే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోవచ్చు.
అయితే తాజాగా జరిగిన మ్యాచ్ లో కూడా విక్టరీ అంత తేలికగా వరించలేదు. 163 పరుగుల లక్ష్య చేధనలో ఓపెనర్లు శుభారంభాన్ని అందించగా, మ్యాచ్ చివరి దశకు వచ్చే సమయానికి రన్ రేట్ దాదాపుగా 12 పరుగులకు చేరుకుంది. ఈ దశలో క్రీజులో ఉన్న మహేంద్ర సింగ్ ధోని పైనే టీం ఆశలు పెట్టుకుంది. కానీ, భారీ షాట్లను కొట్టడంలో విఫలమైన ధోని ఆటతీరుతో విస్తుపోవడం ప్రేక్షకుల వంతయ్యింది. అతి కష్టం మీద సింగిల్స్ కొడుతూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు ధోని.
18వ ఓవర్ వేసిన షమీ చెత్త బంతులను మాత్రం సద్వినియోగం చేసుకున్న ధోని, తదుపరి ఓవర్లో ఇమ్రాన్ తాహీర్ కు దొరికిపోయాడు. ధోని ఉన్నంత సేపు మ్యాచ్ ఢిల్లీ వైపుకే ఉండగా, ధోని ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పరేరా రెండు భారీ సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. దీంతో ఎట్టకేలకు పూణే టీం విజయాన్ని అందుకుంది. అయితే ధోని బ్యాటింగ్ తీరుతో ప్రేక్షకులు మాత్రం పూర్తి నిరాశలో ఉన్నారు. ఓపెనింగ్ నుండి జట్టుకు అండగా ఉంటూ అజేయమైన 63 పరుగులు చేసిన రెహనేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.



