భారత క్రికెట్ చరిత్రలో మరో శకం ముగిసింది. 199 వన్డేలు, 72 టీ-20 మ్యాచ్ లలో జట్టుకు నాయకత్వం వహించి, ఈ తరం అభిమానుల ‘వరల్డ్ కప్’ కలను నెరవేర్చిన ఘనతను సొంతం చేసుకున్న జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ, జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వాస్తవానికి ఎప్పుడు బాధ్యతల నుంచి తప్పుకుంటావు? అన్న ప్రశ్న ఎదుర్కోవడం ధోనికి కొత్తేం కాదు. టెస్టులకు నాయకత్వం వహిస్తున్న కోహ్లి, నెమ్మది నెమ్మదిగా తిరుగులేని కెప్టెన్ గా ఎదగగా, టెస్టుల్లో లేకపోవడంతో ధోనీ జట్టుతో కొనసాగడంలో విరామం వస్తోంది.
దీని ఫలితంగా ఇప్పుడు ఉన్న జట్టు ఓ రకంగా ‘కోహ్లి జట్టు’గా మారిపోయింది. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా, ధోని తప్పుకొని కోహ్లిని అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. అయినప్పటికీ, ధోనీ ఆత్మవిశ్వాసం, అతని నాయకత్వ ప్రతిభపై ఎలాంటి అనుమానాలు లేకపోవడంతో, బోర్డు తానంతట తానుగా అతన్ని తొలగిస్తారన్న సంకేతాలు ఏమీ లేవు. తదుపరి సిరీస్ లు వీలైతే, వచ్చే వరల్డ్ కప్ వరకూ ధోనీ కొనసాగే అవకాశాలు ఉంటాయని అందరూ భావించారు.
ఇదే సమయంలో 2019 వన్డే వరల్డ్ కప్ కోసం, తదుపరి మూడేళ్ల కాలంలో కోహ్లి నేతృత్వంలో జట్టును సిద్ధం చేయాలంటే, తాను తప్పుకోవాలని ధోనీ భావించి ఉంటాడని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. తాను తప్పుకునే సమయం ఆసన్నమైందన్న ఆలోచనలో, ఈ సంవత్సరం ఇంగ్లండ్ తో సీరీస్ నుంచే 2019లో ఇంగ్లండ్ వరల్డ్ కప్ కు సన్నద్ధం అయ్యే అవకాశం కోహ్లీకి ఇవ్వాలన్న ఆలోచనే, తనను తప్పించే అవకాశం బోర్డుకు ఇవ్వకుండా తనంతట తానుగా నిష్క్రమించే ప్రకటన చేయించి వుంటుందని అందరూ భావిస్తున్నారు.
త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీ ముందు ఇంగ్లండ్ తో జరిగే సిరీస్ ధోనీ ఎలా రాణిస్తాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. భారత జట్టులోకి నైపుణ్యవంతులైన యువ ఆటగాళ్లు వస్తుండటంతో వారికి చోటివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిషబ్ పంత్, ఈషాన్ కిషన్ వంటి వికెట్ కీపర్లూ జట్టుకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరో రెండున్నరేళ్లలో వరల్డ్ కప్ కు సన్నద్ధమవ్వాల్సిన పరిస్థితుల్లో, గతంలోలా ధోనీ మ్యాచ్ లను ముగించ లేకపోతున్నాడన్న విమర్శలు పెరుగుతున్నాయి. తాను మ్యాచ్ లకు సరైన ముగింపు ఇవ్వలేక పోతున్నానని స్వయంగా ధోనీ అంగీకరించాడు కూడా. ఇక కొత్త నీరు రావాలంటే, పాత నీరు బయటకు వెళ్లాల్సిందే కదా!



