కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాడేపల్లి గూడెంలో ఒక కార్యక్రమానికి హాజరయ్యి అక్కడ మీడియాతో మాట్లాడారు. తన పాదయాత్రకు చంద్రబాబు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోవడం దారుణం అన్నారు. చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారో చెప్పాలని ఆయన కోరారు.
చంద్రబాబు అనుమతి తీసుకున్న పత్రాలను చూపితే తాను కూడా అదే విదంగా చేస్తానని ఆయన అన్నారు. ఎప్పుడో పాదయాత్ర చేసిన చంద్రబాబు సంగతి వదిలేస్తే ఇప్పుడే పాదయాత్ర మొదలు పెట్టిన జగన్ కూడా పర్మిషన్ తీసుకుని తన పాదయాత్ర చేసుకుంటున్నారు. ఆ పార్టీ ముఖ్యనేతలు డీజీపీని కలిసి కావలసిన పర్మిషన్ తెచ్చుకున్నారు.
వారు ఏ పత్రాలు సమర్పించారో అడిగితే ముద్రగడ స్నేహితుడు, తుని ఘటనలో నిందితుడైన భూమన కరుణాకర రెడ్డి చెప్పారా? పదే పదే చంద్రబాబు చేసినప్పటి పాదయాత్ర పర్మిషన్ కాగితాలే అడిగితే ఎలా? పాపం చంద్రబాబు నాయుడుకు ముద్రగడ అడుగుతారని తెలియక వాటిని ఫైల్ చేసారో లేదో!
అయినా కావాల్సిన ఫార్మటు అడిగితే డీజీపీ ఆఫీస్ వారే ఇవ్వరా? అసలు ఈ ధోరణి విన్నాక అసలు ముద్రగడకు పాదయాత్ర చేసే ఉద్దేశం లేనట్టుంది అనే అనుమానం అందరితో పాటు కాపు కులస్తులకు కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. అలా వస్తే అది ముద్రగడ ఉనికికే ప్రమాదం అని ఆయన ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.



