వైకాపా నేత జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్ ను ముద్రగడ పద్మనాభం ఉన్నది ఉన్నట్టుగా చదువుతున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమ ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూలగొడతానని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ముద్రగడ జగన్ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారని, కాపుల రిజర్వేషన్ అంశానికి, ప్రభుత్వాన్ని కూల్చడానికి సంబంధం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.
ADVERTISEMENT
ముద్రగడ వెంట అసలైన కాపులెవరూ లేరని, ఆయన్ను కాపు వర్గం అసహ్యించుకుంటోందని, ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఆయన మాట్లాడుతున్నారే తప్ప, కాపు వర్గానికి ప్రతినిధిగా తాము భావించడం లేదని మండిపడ్డారు. కాపుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆయన ఎలాంటి పోరాటమూ చేయడం లేదని, జగన్ రాజకీయ ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నదని స్పష్టం చేశారు.
ADVERTISEMENT



