కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తునిలో విధ్వంసం సృష్టించి, రైలును తగలబెట్టిన కేసులో తాజాగా సీఐడీ పోలీసులు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. తుని సంఘటనలో వందలాది నిందితులను గుర్తించిన సీఐడీ విభాగం, సోమవారం నాడు ఆరుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరో వైపు తుని ఘటనకు తానే కారణమని, తనని మాత్రమే అదుపులోకి తీసుకోండంటూ తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో మంగళవారం ఉదయం ముద్రగడ పద్మనాభం ఆందోళనకు దిగారు.
‘తనను అరెస్ట్ చేయాలని’ అమలాపురం పోలీసు స్టేషన్ ఎదుట నిరసన చేపట్టిన ముద్రగడ పద్మనాభంను ఎలాంటి సమాచారం లేకుండా పోలీసులు బలవంతంగా రాజమహేంద్రవరం సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ముద్రగడ వర్గానికి చెందిన వారు, ఆగ్రహావేశాలకు గురై, పోలీస్ వ్యాన్ పై రాళ్ల దాడితో విరుచుకుపడ్డారు. అయితే తామేమీ ముద్రగడను అరెస్ట్ చేయలేదని, గౌరవంగా సీఐడీ కార్యాలయానికి పంపామని, అరెస్ట్ చేసిన వారి వివరాలు మరియు వారిపై ఉన్న ఆధారాలను ముద్రగడకు చూపిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి.
అమలాపురానికి పెద్ద సంఖ్యలో కాపులు తరలి వస్తున్న క్రమంలో పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఉందన్న అనుమానంతో ముద్రగడను పోలీసులు రాజమండ్రిలోని సీఐడీ కార్యాలయానికి తరలించినట్లుగా చెప్పారు. అయితే అక్కడ కూడా ముద్రగడను ఉంచడం క్షేమం కాదని భావించిన పోలీసులు గట్టి బందోబస్తు నడుమ సొంతూరు కిర్లంపూడికే తరలించారు. అయితే ఇక్కడే ఉంది అసలు “ట్విస్ట్!”
అమలాపురం నుంచి అటూ ఇటూ తిప్పి, కిర్లంపూడిలోని ఇంటి వద్ద దించాలని చూసిన ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులతో ముద్రగడ వాగ్వాదానికి దిగారు. పోలీసు వ్యాన్ ను తాను దిగబోనని, అరెస్ట్ చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని లేకుంటే తనను అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పోలీసులు ఉన్నారు. తనను బలవంతంగా వ్యాన్ నుంచి దించితే, మరోసారి స్టేషన్ ను ముట్టడిస్తానని హెచ్చరించినట్టు తెలుస్తోంది.
కేసులో నిందితులుగా ఉన్న వారి జాబితాను తనకిస్తే, తానే స్వయంగా వారిని స్టేషనులో అప్పగిస్తానని, అమాయకులను భయాందోళనలకు గురిచేస్తే మాత్రం ఊరుకునేది లేదని ముద్రగడ డీఎస్పీలతో వాదనలకు దిగుతున్నారు. ముద్రగడతో చర్చల సారాంశాన్ని ఎస్పీకి తెలిపిన అధికారులు, ప్రతిస్పందన కోసం వేచి చూస్తున్నారు. దాదాపుగా గత కొన్ని గంటలుగా ముద్రగడ అలాగే పోలీస్ వ్యాన్ లో బీష్మించుకుని కూర్చున్నారు. ఈ పరిణామాలతో అమలాపురం, కిర్లంపూడిలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే కొద్ది గంటల్లో ఏం జరగబోతుందో అన్న ఆసక్తి, ఆందోళన రాష్ట్ర ప్రజానీకంలో వ్యక్తమవుతోంది.



