కాపు సామాజిక రిజర్వేషన్ల కొరకు ఆందోళనలు నిర్వహిస్తున్న ముద్రగడ రాజకీయ కార్యాచరణ వెనుక వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఉన్నారన్న వ్యాఖ్యలు ఇటీవల వ్యక్తమైన విషయం తెలిసిందే. కాపు ఉద్యమం లేవనెత్తిన నాటి నుండి మొన్నటి లేఖ వరకు ఇలాంటి ఆరోపణలే ముద్రగడపై వ్యక్తమయ్యాయి. అయితే వీటిని ఖంచించిన ముద్రగడ, తాజాగా మరోసారి జగన్ డైలాగ్ ను రిపీట్ చేయడం ఆసక్తికర అంశంగా మారింది.
“తానూ తలుచుకుంటే ఒక గంటలో చంద్రబాబు సర్కార్ ను కూల్చివేస్తానంటూ” వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యల పర్యవసానాన్ని ప్రస్తుతం జగన్ అనుభవిస్తున్నారు. అయితే ఇవే మాటలను కాస్త అటు ఇటుగా మార్చి ముద్రగడ పద్మనాభం తాజాగా వ్యాఖ్యానించారు. “తానూ తలచుకుంటే మూడు నిముషాల్లో చంద్రబాబు కుర్చీని కదిలించగలనని” ముద్రగడ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
అయితే అలాంటి కుట్రలకు తనూ వ్యతిరేకినని, చంద్రబాబు, తానూ ఒకే సమయంలో రాజకీయాల్లోకి వచ్చామని, చంద్రబాబు దగ్గర డబ్బు ఉండడం వల్ల ఆయన ఉన్నత పదవులు అలంకరించారని, తన దగ్గర డబ్బు ఉంటే చంద్రబాబు కంటే గొప్ప స్థాయిలో ఉండే వాడినని, డబ్బుంటే తెలివితేటలు వచ్చేస్తాయి…. అవి లేని కారణంగా ఉన్నత పదవులు అలంకరించలేదని… అసలు ఉద్యమ మాటలను కాసేపు పక్కన పెట్టారు. ఈ సందర్భంగా కూడా జగన్ తన వెనక ఉన్నాడన్న ఆరోపణలు ఖండించారు.



