టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయ్యి నేటికీ 48 రోజులు. తెలుగు సినీ పరిశ్రమలో కొందరు ప్రముఖులు ఆయనను అరెస్టు చేసిన వెంటనే స్పందించారు. కానీ చాలామంది స్పందించలేదు. అయితే ఎట్టకేలకు సినీ పరిశ్రమలో కొందరు బుధవారం మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించారు. ఆయనకు సంఘీభావం తెలిపారు.
బుధవారం ఫిలిం ఛాంబర్లో ‘చంద్రబాబు గారితో మనం’ పేరిట మీడియా సమావేశంలో పలువురు దర్శకులు, నిర్మాతలు పాల్గొని చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించారు.
ప్రముఖ నటుడు, మాజీ టిడిపి ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ, “ఎల్లప్పుడు రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం గురించే ఆలోచించే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసి జైల్లో నిర్బందించినందుకు తెలుగు సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరం చాలా బాధపడుతున్నాం. అయితే మా బాధను ఎలా వ్యక్తం చేయాలనే ఆలోచనే తప్ప ఈ విషయంలో మాకు భిన్నాభిప్రాయాలు లేవు.
ఎన్నడూ ఇంటి గుమ్మం దాటి బయటకు రాని ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిగారు, అలాగే వారి కోడలు బ్రాహ్మణి కూడా తొలిసారిగా ప్రజల మద్యకు వచ్చి న్యాయం కోసం పోరాడుతున్నారు. వారి పోరాటాలు తప్పక ఫలిస్తాయి. నిజం తప్పక గెలుస్తుంది.
సూర్యచంద్రులకే గ్రహణం తప్పదు. కానీ కొన్ని గంటలు మాత్రమే గ్రహణం సూర్యచంద్రులను కనబడకుండా చేయగలదు. అలాగే చంద్రబాబు నాయుడుకి పట్టిన ఈ గ్రహణం కూడా త్వరలోనే తొలగిపోయి, కడిగిన ముత్యంలా ప్రజల మద్యకు మళ్ళీ వస్తారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిపదంలో నడిపిస్తారని మేమందరం గట్టిగా నమ్ముతున్నాము.
కనీసం ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం మేల్కొని చంద్రబాబు నాయుడుని తక్షణం విడుదల చేయాలని కోరుతున్నాము,” అంటూ ఆనాడు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐటి రంగం అభివృద్ధి కోసం ఏవిదంగా కష్టపడ్డారో మురళీమోహన్ తెలియజేశారు.
చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించి ఆయనకి సంఘీభావం తెలపడానికి తెలుగు సినీ పరిశ్రమకు 48 రోజులు పట్టింది. కానీ నిన్నటి మీడియా సమావేశంలో ఇంకా చాలా మంది దర్శకనిర్మాతలు, నటీనటులు పాల్గొనలేదు. చంద్రబాబు నాయుడునే అరెస్ట్ చేసి జైల్లో వేసిన జగన్, ఆయన అరెస్టుని ఖండించినవారిని, ఆయనకు సంఘీభావం తెలిపినవారిని ఉపేక్షిస్తారనుకోలేము. అందుకే నేటికీ సినీ పరిశ్రమలో చాలామంది మౌనంగా ఉండిపోతున్నారు.
అయితే మురళీమోహన్ చెప్పిన్నట్లు ఈ అకృత్యాలన్నటినీ సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరూ వ్యతిరేకిస్తుంటారని అందరికీ తెలుసు. ఒక్క సినీ పరిశ్రమలో మాత్రమే కాదు… రాష్ట్రంలో అన్ని రంగాలకు చెందినవారు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలలో కూడా వైసీపి ప్రభుత్వం పట్ల ఇటువంటి వ్యతిరేకతే నెలకొనిది ఉంది. వారందరి మౌనం వచ్చే ఎన్నికలలో ప్రళయంలా వైసీపిని ముంచేయవచ్చు.




