దేశంలో ఐటి రంగాన్ని మొట్టమొదట అందిపుచ్చుకొన్నవారు తెలుగువారే. అందుకే ప్రపంచంలో అన్ని దేశాలలో మన ఐటి ఇంజనీర్లు కనిపిస్తుంటారు. సమైక్య ఏపీకి సంబందించినంత వరకు చంద్రబాబు నాయుడు హయాంలోనే హైదరాబాద్లో ఐటి రంగం శరవేగంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఐటి కంపెనీలు, కొలువులు అంటే అందరికీ బెంగళూరు మాత్రమే గుర్తొచ్చేది. అందరూ అక్కడికే వలసలు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఐటి రంగంలో బెంగళూరు కంటే హైదరాబాద్ శరవేగంగా ఎదుగుతోంది. ఆనాడు చంద్రబాబు నాయుడు వేసిన ఐటి విత్తనాలే నేడు కల్పవృక్షాలై ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆర్ధిక వనరుగా, ఉద్యోగాలు, ఉపాది కల్పిస్తున్నాయని అందరికీ తెలుసు.
రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ఏపీ మళ్ళీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ అమరావతిని, విశాఖనగరాన్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చాలా గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభుత్వం మారడంతో దాని ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి. దాంతో ఐటి రంగంలో ఇతర రాష్ట్రాలకి నాయకత్వం వహించాల్సిన స్థానం నుంచి అట్టడుగు స్థానానికి పడిపోయింది.
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఇక్కడ మధురవాడలోని ఐటి కంపెనీల ఏర్పాటు కోసం నిర్మించిన మిలీనియం టవర్లో బ్లాక్-ఏలో 2 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణం ఉంటే దానిలో సగం కూడా నింపలేకపోయింది మన రాష్ట్ర ప్రభుత్వం. బ్లాక్-బిలో 1.53 చదరపు అడుగులు విస్తీర్ణం ఉంటే దానిలో ఒక్క అడుగు కూడా నింపలేకపోయింది. వీరా… ఉద్యోగాలు, అభివృద్ధి, డెస్టినేషన్ సిటీ విశాఖ గురించి మాట్లాడేది?
భారతదేశంలో ఐటి ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎక్కడుందంటే కింద నుంచి రెండో స్థానంలో ఉంది. భారతదేశం ఐటి ఎగుమతులలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటా ఎంతంటే కేవలం 0.1 శాతం. కనీసం ఒక్క శాతం కూడా కాదన్న మాట!
మన పొరుగు రాష్ట్రం తెలంగాణ ఏడాదికి రూ.1.83 లక్షల కోట్లు ఐటి ఎగుమతులు చేస్తుంటే మన రాష్ట్రం కేవలం రూ.1,290 కోట్లు మాత్రమే చేయగలుగుతోంది. తెలంగాణలో ఐటి రంగంలో ప్రతీ ఏటా సుమారు 2 లక్షల ఉద్యోగాలు సృష్టించుకొంటున్నారు. మరి మన రాష్ట్రంలో ఐటి పరిస్థితి ఎందుకు దయనీయంగా ఉంది? ఏమైపోయింది మీ నాయకత్వం… మీ దూరదృష్టి….మీ ప్రభుత్వ విధానాలు?ఐటి రంగాన్ని అభివృద్ధి చేయలేని మీరా… విశాఖ రాజధానితో ఉత్తరాంద్ర జిల్లాలని అభివృద్ధి చేస్తారు?” అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.



