రాంగోపాల్ వర్మ కామెడీ… చూసి చాలా రోజులే అయ్యిందిగా!

Ram gopal varma

తెలుగు సినీపరిశ్రమలో శివతో ఓ సంచలనం సృష్టించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఏ జోనర్‌లో అయిన అద్బుతమైన సినిమాలు తీయగలనని నిరూపించుకొన్నారు కూడా. కానీ ఆ గుర్తింపు, గౌరవమే ఆయన తీరుతెన్నులను పూర్తిగా మార్చేసింది.

అప్పటి నుంచే ‘నేను తీసిందే సినిమా చూస్తే చూడండి లేకుంటే మీ ఖర్మ…’ అనే స్థాయికి వెళ్ళిపోయారు. అలా ఆయన డౌన్‌ఫాల్ మొదలైనప్పటికీ నిత్యం వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ లేదా వివాదాస్పద సినిమాలు చేస్తూ మీడియా ఫోకస్, ప్రజల దృష్టి కూడా తన మీద ఉండేలా జాగ్రత్తపడుతుంటారని అందరికీ తెలిసిందే.

ADVERTISEMENT

అటువంటి మరో ప్రయత్నమే ఆయన తీసిన వ్యూహం సినిమా. దానిలో వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ప్రత్యర్ధుల కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొంటూ ఏపీ ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరుని చూపిస్తున్నానని చెప్పుకొన్నారు.

కానీ ఆయన ఎదుగుదల కంటే, చంద్రబాబు నాయుడుతో సహా ఆయన ప్రత్యర్ధులని కించపరుస్తూ ప్రజల దృష్టిలో దోషులుగా నిలిపేందుకే ప్రయత్నించారు. కనుక ఆ సినిమాని నిలిపివేయాలని కోరుతూ నారా లోకేష్‌ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు దీనిపై ఇంకా తీర్పు చెప్పవలసి ఉంది.

మీడియా ఫోకస్, ప్రజల దృష్టిలో పడేందుకు లభించే ఏ చిన్న అవకాశాన్ని రాంగోపాల్ వర్మ వదులుకోరని నిరూపిస్తూ, ఆయన బుధవారం విజయవాడలో ఏపీ డిజిపిని కలిసి అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావు వలన తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారు.

దీనిపై నటుడు, జనసేన నేత నాగబాబు తనదైన శైలిలో స్పందిస్తూ, “వర్మపై కొలికిపూడి చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు… ఇండియాలోనే ఏ పనికిమాలిన వెదవ మీకు ఎటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో విలన్‌ మద్య ఫైటింగ్ జరుగుతుంటే మద్యలో కమెడీయన్‌ని ఎవరూ చంపరు కదా?కనుక వర్మగారు మీరేం భయపడకండి. హాయిగా ఓ పెగ్గు ఓడ్కా వేసి పడుకోండి,” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

తన సినిమాలతో గొప్ప దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవలసిన రాంగోపాల్ వర్మ ఈవిదంగా ‘లైవ్‌’లో ఉంటుండటం విశేషమే కదా?

ADVERTISEMENT
Latest Stories