ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ ముగిసిన తర్వాత నేడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. టిడిపి, బీజేపీ పొత్తులు దాదాపు ఖరారైన్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో జనసేన సీనియర్ నేత నాగబాబుని మీడియా ప్రతినిధుల వివరణ కోరారు.
రాష్ట్రంలో వైసీపి రాక్షస పాలన అంతమొందించడానికి టిడిపి, జనసేన, బీజేపీల పొత్తులు చాలా అవసరమని, పొత్తులు దాదాపు ఖాయం అయిన్నట్లే కానీ ఈ మాట పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్తారని నాగబాబు అన్నారు.
పవన్ కళ్యాణ్ శాసనసభకు పోటీ చేస్తే టిడిపితో ‘పవర్ షేరింగ్’ సమస్య వస్తుంది. అలాగే ముఖ్యమంత్రి కాకపోతే జనసేనలో అసంతృప్తి కలుగుతుంది కనుక ఈసారి లోక్సభకు పోటీ చేస్తారని, కేంద్రమంత్రి పదవి చేపడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వాటిపై నాగబాబుని వివరణ కోరగా, “అవన్నీ ఊహాగానాలు మాత్రమే. మాకు పవర్ షేరింగ్ కంటే రాష్ట్రంలో రాక్షసపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే చాలా ముఖ్యం. మా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎవరికెన్ని సీట్లున్నాయనే దానిని బట్టి పదవులు లభిస్తాయి. కనుక ఇప్పటి నుంచి పవర్ షేరింగ్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. త్వరలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా అన్ని విషయాలపై స్పష్టత ఇస్తారు,” అని నాగబాబు చెప్పారు.
జనసేన 50-60 సీట్లు తీసుకోవాలని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కొందరు ‘శ్రేయోభిలాషులు’ జనసేనకు శల్యసారధ్యం చేస్తున్నారు. కానీ నాగబాబు చెప్పిన ఈ మాటలు వింటే, వైసీపిని ఓడించేందుకు పవన్ కళ్యాణ్ పట్టువిడుపులకు సిద్దంగా ఉన్నారని స్పష్టం అవుతోంది. ఈ విషయం ‘శ్రేయోభిలాషులు’ కూడా గ్రహిస్తే మంచిది.






