టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు రూపొందుతూ ఉంటాయి. అందులో విజయం సాధించే వాటిని మాత్రం వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అలా అసలు విడుదలైందో లేదో కూడా తెలియని ఓ సినిమాలో ద్వితీయ ప్రాధాన్య పాత్రల్లో నటించి, సహనటితో సహజీవనం చేసిన నటుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘పక్కా ప్లాన్’ అనే సినిమాలో కర్ణాటకలోని యాద్గీర్ జిల్లాకు చెందిన నగేష్ యాదవ్, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాగరాణి రెండో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించారు.
ఈ సినిమాలో నటించే నాటికే నాగరాణికి వివాహమై విడాకులు కూడా తీసుకుంది. అప్పటికే ఆమెకు ఆరు నెలల పాప కూడా ఉంది. సినిమాలో నటిస్తున్న సమయంలో నరేష్ తో నాగరాణికి పరిచయం పెరిగి, ఇది కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ ఒకే ఇంటికి మకాం మార్చి, చాలా కాలంగా సహజీవనం చేస్తుండడంతో తనను వివాహం చేసుకోవాలని నాగరాణి ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దీంతో నగేష్ ఆమెకు ముఖం చాటేయడం, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.



