నారా భువనేశ్వరి నందమూరి ఆడపడుచుగా, నారా వారి కోడలుగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణిగా తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితురాలే. అయితే బాబు అరెస్టుతో ప్రజాక్షేత్రంలోకి “నిజం గెలవాలి” కార్యక్రమంతో తన తొలి అడుగు వేస్తున్నారు భువనేశ్వరి. ఎంత కష్టమైన నిజాయితీని వదలకూడదని, తెలుగు జాతి ఉన్నతికి కృషి చేయడంలో మన పాత్ర ఉండాలి అంటూ తన తండ్రి ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు భువనేశ్వరి.
ఈ నేపథ్యంలో నారావారి పల్లెలోని తన తండ్రి ఎన్టీఆర్ విగ్రాహానికి నివాళులు అర్పించి, అక్కడి గ్రామా దేవతలు పూజ కార్యక్రమాలు ముగించుకుని బస్సు యాత్రను మొదలు పెట్టారు భువనేశ్వరి. అయితే ఈ విషయమై ఆమె స్పందిస్తూ భావోద్వేగమైన సందేశాన్ని తన X మాధ్యమం ద్వారా పోస్ట్ చేశారు.
నా భర్త లేకుండా తొలిసారి తిరుమల కు వెళ్ళాను. ఎప్పుడు కుటుంబసభ్యులతో ఇక్కడికి వచ్చే నేను ఇప్పుడు ఒంటరిగా నారావారిపల్లె రావడం బాధ కలిగిస్తుందని,తనకు ప్రతి నిమిషం భారంగా గడుస్తుందని వాపోయారు. ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి దీవెనతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని తానూ నమ్ముతున్నాను అంటూ తెలిపారు.ఈ పోస్టును చూసిన వారంతా మీకు మేమున్నాం అంటూ భువనేశ్వరికి తమ మద్దతును తెలుపుతున్నారు.
బాబుకి మద్దతుగా ఈ యాత్రను మొదలుపెట్టిన భువనేశ్వరికి స్థానిక ప్రజల నుండి అనూహ్య స్పందన ఎదురయ్యింది. బాబు అరెస్టుని జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలిన చంద్రగిరిలో ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని, పాకాలలో చిన్నబ్బనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి,చనిపోయిన వారి చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళ్లు అర్పించి ఒక్కో కుటుంబానికి మూడు లక్షల ఆర్ధిక సాయాన్ని అందించనున్నారు.
బాధిత కుటుంబాల యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని వారికి అండగా టీడీపీ పార్టీ ఎప్పుడు నిలబడే ఉంటుంది అనే భరోసాను ఆయా కుటుంబాలకు భువనేశ్వరి అందించారు. నిజం గెలవాలి పేరుతో రాజకీయ క్షేత్రంలోకి తొలి అడుగు వేసిన భువనేశ్వరి ఈ రోజు బస్సు యాత్రను ముగించుకుని సాయంత్రం చంద్రగిరిలో టీడీపీ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.
అయితే ఇది తన తొలి రాజకీయ ప్రసంగం కావడంతో ఆమె వైసీపీ ప్రభుత్వం పై ఎటువంటి విమర్శలు చేస్తుందో, ప్రజలను ఉద్దేశించి ఎటువంటి సందేశం ఇస్తారో,టీడీపీ క్యాడర్ కు ఎటువంటి దిశా నిర్దేశం చేస్తారో అంటూ అటు రాజకీయ పార్టీల తో పాటు ఇటు ప్రజలలోను తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి.




