నారా లోకేష్ 2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గం ప్రజలతో మమేకం అవుతూ సొంత ఖర్చుతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. 2024 ఎన్నికలలో మళ్ళీ అక్కడి నుండే పోటీ చేసి ఘన విజయం సాధించారు.
కనుక ఎన్నికలకు ముందు నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటిగా నెరవేరుస్తున్నారు. మంగళగిరిలో 3,000 మందికి భూముల పట్టాలు ఇప్పించారు. నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. త్వరలోనే మహానాడు కాలనీలో రీటెయినింగ్ వాల్, రెండు నెలల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు మొదలుపెట్టబోతున్నారు. మంగళగిరిలో ఇంకా అనేక అభివృద్ధి పనులు మొదలుపెట్టబోతున్నారు.
ఓ ఎమ్మెల్యేగా నారా లోకేష్ తన నియోజకవర్గాన్ని ఇంతగా అభివృద్ధి చేసుకోవడం చాలా అభినందనీయమే. “కానీ మంగళగిరికే పరిమితమైతే ఎలా? రాష్ట్రంలో పర్యటించరా?” అని మీడియా ప్రతినిధులు ఇటీవల సూటిగానే ప్రశ్నించగా నారా లోకేష్ కూడా అంతే సూటిగా “ముందు మంగళగిరి ప్రజలకు నేను ఇచ్చిన హామీలు పూర్తి చేసిన తర్వాత పర్యటిస్తాను,” అని చెప్పారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో దాదాపు అన్ని జిల్లాలలో పర్యటించారు. అప్పుడు ఆయా జిల్లాలు, నియోజకవర్గాలలో సమస్యలు అడిగి తెలుసుకొని వాటన్నిటినీ పరిష్కరిస్తానని ప్రజలకు మాట ఇచ్చారు.
ఆ మాట తప్పితే తనను నిలదీయమని చెప్పేందుకు ప్రతీ 100 కిమీలకు ఒకటి చొప్పున హామీలతో కూడిన శిలా ఫలకాలు ఆవిష్కరించారు కూడా. కనుక నారా లోకేష్ కేవలం మంగళగిరి ప్రజలకు మాత్రమే కాదు యావత్ రాష్ట్ర ప్రజలకు లిఖిత పూర్వకంగా హామీలు ఇచ్చినట్లే.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 10 నెలలు గడిచిపోయాయి. కనుక ఇంకా ఆలస్యం చేస్తే యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ శిలా ఫలకాలకే పరిమితమని ప్రజలు అనుకోవచ్చు. వారికి అటువంటి అభిప్రాయం లేకపోయినా కలిగించేందుకు వైసీపీ తప్పకుండా ప్రయత్నిస్తుంది. కనుక నారా లోకేష్ వీలైనంత త్వరగా మంగళగిరి నుంచి బయటకు వచ్చి, యువగళం హామీల అమలుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
అయితే కూటమి ప్రభుత్వంలో ఆయన ఒక్కరే ఎమ్మెల్యే, మంత్రి కాదు. ఇంకా చాలా మందే ఉన్నారు. కనుక వారు కూడా నారా లోకేష్లాగే తమ తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకొని మంచి పేరు సంపాదించుకుంటే వచ్చే ఎన్నికలలో ప్రజలు మళ్ళీ గెలిపిస్తారు. ఓ ఎమ్మెల్యేగా, మంత్రిగా నారా లోకేష్ తన మంగళగిరి నియోజకవర్గాన్ని ఏవిదంగా అభివృద్ధి చేసుకుంటున్నారో, అదే విదంగా తమ నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందాలని రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటే తప్పు కాదు కదా?




