ఒక్క విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబడింది. దానికి కారణం కూడా జగనే అని చెప్పకతప్పదు. ఇక విషయానికి వస్తే దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవరు అంటే అందరి చూపు, అందరి వేళ్ళు ఏపీ వైపే ఉంటాయి. అది జగన్ మోహన్ రెడ్డి పేరే చెపుతాయి.
ఇవి విపక్ష పార్టీ నేతలో, జగన్ అంటే గిట్టని వారో చెపుతున్న మాటలు కావు. ఈ ఇంటర్నెట్ జమానాలో దేనికైనా సమాధానం చెప్పగలిగేది, ఎవ్వరైనా నమ్మగలిగేది ఒక్క గూగుల్ తల్లినే. జగన్ ఆస్తుల చిట్టా ఇంటర్నెట్ సాక్షిగా ఇంటర్ నేషనల్ పత్రికలలో కూడా ప్రచురించబడింది. అయితే జగన్ మాత్రం ఇందుకు విరుద్ధమైన ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో ప్రతిపక్ష పార్టీలను, ఆయా పార్టీ నేతలను ప్రజలకు దూరం చేయడానికి రానున్న ఎన్నికలు “పేదలకు -పెత్తందారులకు” మధ్య జరిగే కురుక్షేత్రం అంటూ తన ముందున్న స్క్రిప్ట్ పేపర్ చదువుతూ ఉంటారు. ఇందులో పేదలేవరనేది ఇప్పటికి అర్ధం కానీ ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే దీనికి సమాధానం పవన్ తన వారాహి యాత్రలో కొంతవరకు చెప్పే ప్రయత్నం చేశారు.
అయితే తాజాగా టీడీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విపులంగా లెక్కలతో ఈ పేదవాడి కాన్సెప్ట్ ను ప్రజలకు వివరించారు. అవును జగన్ పేదవాడే ఎంత పేదవాడంటే హైద్రాబాద్ లోటస్ పాండ్ లో ఒక ప్యాలస్, బెంగళూర్ లో ఒక ప్యాలస్, పులివెందుల లో ఒక ప్యాలస్, తాడేపల్లిలో ఒక ప్యాలస్, తాజాగా విశాఖ రుషికొండ మీద మరో ప్యాలస్ కట్టుకునేంత పేదవాడు మన సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటూ జగన్ ప్యాలస్ ల లిస్ట్ లోకేష్ ప్రజల ముందుంచారు.
ఒక్క ఏపీలో లోనే మూడు ప్యాలస్ లు నిర్మించుకునేంత పేదవాడు ఈ జగన్. రాష్ట్రానికి మూడు రాజధానులు అన్నాడు కనీసం ఒక రాజధాని కూడా నిర్మించలేకపోయాడు. కానీ రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో తన ప్యాలస్ ల నిర్మాణం మాత్రం పూర్తి చుకున్న జగన్ నిజంగా పేదవాడేనేమో. ఉచిత పథకాల పంపిణీలతో రాష్ట్రాన్ని పేదిరికంలోకి నెట్టి, రాబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఓట్ల రాజకీయాలు చేస్తూ ప్రజల పై, ప్రతిపక్షాల పై పెత్తనం చేస్తున్న ఈ జగన్ పెత్తందారుడు కాదా?
దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దగ్గర నుండి దాదాపుగా 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచి, పేదల పై సుమారుగా 11 వేలకోట్ల భారం మోపిన దోపిడీదారు ఈ జగన్ అంటూ లోకేష్ వైసీపీ పై విరుచుకుపడ్డాడు. రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా నదీ జలాల వాటాను వదులుకున్న పెత్తదారుడు ఎవరో? అధికారం అనే అందలం ఎక్కగానే హైద్రాబాద్ లో ఉన్న రాష్ట్ర ఆస్తులను పక్క రాష్ట్రం ముఖ్యమంత్రికి దారాదత్తం చేసిన దానకర్ణుడు ఎవరో?
ఇసుక మాఫియా ఒక తమ్ముడికి, మద్యం మాఫియా మరో తమ్ముడికి అప్పగించిన అక్రమార్కుడు ఎవరో? 550 కోట్ల ప్రభుత్వ సొమ్ముతో విశాఖలో నిర్మిస్తున్నజగన్ బంగ్లా పేదవాడిదా? 25 లక్షలతో బాట్ టబ్, 10 లక్షలతో టోయిలెట్ నిర్మించ్చుకునే జగన్ పేదవాడేగా? లక్ష రూపాయలు ఖరీదైన చెప్పులు వేసుకునే జగన్ కచ్చితంగా పేదవాడే అయ్యుంటాడులే అంటూ లెక్కల ఆధారాలతో జగన్ పేదరికాన్ని ప్రజలకు వివరించారు లోకేష్.
సొంత ఛానెల్ ఉండి, సొంత పత్రికను నడుపుతూ, సొంత సిమెంట్ ఫ్యాక్టరీలను స్థాపించి, సొంతంగా పవర్ ప్లాంటులను నడుపుతున్న జగన్ నిజంగా పెద్దవాడా? తన ఓట్ల రాజకీయంతో రాష్ట్రంలో ఉన్న సామాన్య మధ్యతరగతి ప్రజలను పేదవారిగా మర్చి వారి పై కూడా తన పెత్తనాన్ని కొనసాగించాలనే పేదరిక పెత్తందారుడు ఈ జగన్ అంటూ అటు మధ్యతరగతి ప్రజలు జగన్ ప్రభుత్వ విధానాల పై తమ ఆక్రోశాన్ని వెల్లబువుచ్చుతున్నారు.
ప్రజలు కూడా ఒక్కసారి విజ్ఞతతో ఆలోచిస్తే అర్ధమవుతుంది రాష్ట్రంలో పేదవాడు ఎవరో?పేదవాడుగా మారుస్తుంది ఎవర్నో? ఇంకా కొన్ని రోజులు పోతే జగన్ తానూ పేదవాడిని తనకు కూడా ప్రభుత్వ పథకాలు కావలి అంటూ వైట్ రేషన్ కార్డుకు అప్లై చేసుకుంటారేమో అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా మొదలయ్యాయి. మొత్తానికి లోకేష్ దేశంలోనే ‘అతి పెద్ద ధనిక పేదవాడు’ జగన్ అని చెప్పినట్టున్నారు. ఇక ప్రజలే ఆలోచించుకోవాలి మనం ఏ పేదవాడి పక్కన నిలబడాలి అని.




