టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రజాసమస్యలు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ నేతల అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాల గురించి, టిడిపి తరపున ఇస్తున్న హామీలు మాత్రమే కాదు. రైతులు, కార్మికులు, మహిళలు, నిరుద్యోగ యువత, విద్యార్థులతో ముఖాముఖీ మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పి భవిష్యత్పై నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
అంతేకాదు… విద్యార్థులు, నిరుద్యోగ యువతతో మాట్లాడుతున్నప్పుడు వారిలో స్పూర్తి నింపేందుకు చదువులు, పరీక్షలు, ఉద్యోగాలు, జీవితంలో ఒడిదుడుకులు ఇలా అనేక అంశాల గురించి చక్కగా వివరిస్తున్నారు.
ఇటీవల గూడూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు చెప్పిన ఈ విషయాలను విన్నప్పుడు మన రాజకీయ నాయకులలో ఏ ఒక్కరూ ఇలాంటి మంచి మాటలు చెప్పలేదే?అనిపిస్తుంది.
ఇంతకీ నారా లోకేష్ వారికి ఏమి చెప్పారంటే, “విద్యార్థులు చదువుల ఒత్తిడికి గురయ్యి మార్కులు తక్కువ వచ్చాయనో లేదా పరీక్షలో ఫెయిల్ అయ్యామనో అవమానంగా భావించి ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదు. జీవితంలో ఎవరికీ స్మూత్ రోడ్ అనేది ఉండదు.
నేను కూడా రాజకీయాలలో ప్రవేశించాక అనేక ఎదురు దెబ్బలు తిన్నాను. మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాను. కానీ అంతమాత్రన్న నిరాశ పడి మద్యలో విడిచిపెట్టేయలేదు. ఎక్కడైతే ఓడిపోయానో అదే నియోజకవర్గంలో గత నాలుగేళ్లుగా పనిచేస్తూ ప్రజల నమ్మకాన్ని సంపాదించుకోగలిగాను. వచ్చే ఎన్నికలలో టిడిపి గెలుచుకోబోయే మొదటి సీటు మంగళగిరిగా చేశాను.
నేను మీకు ఇదెందుకు చెపుతున్నానంటే ఒక పరీక్ష ఫెయిల్ అయ్యామనో లేదా ఇంట్లో తల్లితండ్రులు తిట్టారనో అదే పనిగా బాధపడుతూ ఉండిపోకూడదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. మనకి నేడు, రేపు, ఎల్లుండి… ఎదురుగా బోలెడు భవిష్యత్ ఉంది అని గుర్తుంచుకోవాలి.
చంద్రబాబు నాయుడుగారు ఎమ్మెల్యేగా అయ్యే ముందు చాలా ఎదురుదెబ్బలు తిన్నారు. మీ అందరికీ హెరిటేజ్ కంపెనీ గురించి తెలుసు. అది గొప్పగా నడుస్తోందని తెలుసు. అయితే చంద్రబాబు నాయుడు 1992లో దానిని ప్రారంభిచే ముందు వరుసగా నాలుగు కంపెనీలు పెట్టి నష్టపోయారు. నాలుగుసార్లు నష్టపోయాను కదా అని 5వ సారి ఆయన ప్రయత్నం చేయకుండా మానుకొని ఉండి ఉంటే నేడు హెరిటేజ్ కంపెనీ ఉండేది కాదు. దానిలో వేలమందికి ఉద్యోగాలు, ఉపాధి లభించి ఉండేవీ కావు కదా?
కనుక మనం ఏదైనా చేయాలి… సాధించాలి అనే పట్టుదల కలిగి ఉండాలి. అది ఉంటే ఏదైనా సాధ్యమే. చిన్నవి భూతద్దంలో నుంచి చూస్తే పెద్దవిగానే కనబడుతాయి. అలాగే మన జీవితంలో చిన్నచిన్న విషయాలను పెద్దవి చేసుకొని వాటితోనే బాధపడుతూ జీవితం పాడుచేసుకోకూడదు.
ఏమి జరిగినా మనం ముందుకే సాగిపోతుండాలి. మద్యలో ఆగిపోయి నా జీవితం ఇలా ఉందేమిటి?అని ఆలోచించి బాధపడుతూ ఉండిపోతే అక్కడే ఉండిపోతాము. జీవితంలో ప్రతీ ఓటమి మనకి ఓ పాఠం వంటిది. మళ్ళీ అటువంటి పొరపాట్లు చేయకుండా ఉండేందుకు అవి మనకు ఉపగపడతాయని గ్రహిస్తే ఓటమి నుంచి విజయం వైపు ఏవిదంగా ముందుకు సాగాలో అర్దమవుతుంది,” అని నారా లోకేష్ విద్యార్థులకు జీవితం గురించి చక్కగా వివరించారు. ఇలాంటి మంచి మాటలు ఏ రాజకీయ నాయకుడు నోట అయినా ఎప్పుడైనా విన్నామా?



