లోకేష్‌ ప్రయత్నాలు ఓకే… కానీ పొత్తుల సంగతేమిటి?

Nara Lokesh Meets Amit Shahటిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని జగన్‌ చెర నుంచి విడిపించుకొనేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. వాటిలో భాగంగా నిన్న ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి, ఏపీలో పరిస్థితులను వివరించారు.

ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మోడీ, అమిత్ షాల వద్దే లభిస్తుందని అందరికీ తెలుసు. కనుక నారా లోకేష్‌ ప్రయత్నాన్ని తప్పు పట్టలేము.

ADVERTISEMENT

అయితే ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులతో కలిసి భేటీ అవడంతో ఏపీలో ఎన్నికల పొత్తులపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. బీజేపీని విడిచిపెడితే తాము టిడిపి, జనసేనలతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని, బీజేపీని నమ్ముకోవడం కంటే తమతో చేతులు కలిపితే వైసీపిని ఓడించగలమని వామపక్షాలు టిడిపి, జనసేనలకు బహిరంగంగానే విజ్ఞప్తి చేస్తున్నాయి.

కానీ నారా లోకేష్‌ రెండు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో కలిసి వారి అగ్రనేతను కలవడంతో వామపక్షాలు పునరాలోచించుకోవలసివస్తుంది. చంద్రబాబు నాయుడుని విడిపించుకొనేందుకే నారా లోకేష్‌ వారితో కలిసి అమిత్ షాతో భేటీ అయ్యారని వామపక్షాలకు కూడా తెలుసు. కానీ ఈ భేటీతో టిడిపి, జనసేన, బీజేపీల పొత్తులకు దారితీస్తే వామపక్షాలు దూరం అవుతాయి.

జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఏ కారణంతో భేటీ అయినా సమర్ధించుకోవచ్చు. కానీ నారా లోకేష్‌ అలా సమర్ధించుకోలేరు. కనుక వైసీపి నేతలు తప్పకుండా ఈ భేటీ గురించి దుష్ప్రచారం చేయడం ఖాయం.

ఈ భేటీలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఉన్నందున ఆమెను కూడా విమర్శించేందుకు వైసీపికి అవకాశం లభించిన్నట్లయింది. అలాగే నారా లోకేష్‌తో కలిసి వెళ్ళినందుకు తెలంగాణలో బిఆర్ఎస్ నేతలు కిషన్‌రెడ్డిని కూడా విమర్శించవచ్చు.

కనుక ఈ భేటీ చంద్రబాబు నాయుడు అరెస్టు, కేసులు, రాజకీయ కక్ష సాధింపులకే పరిమితం అవుతాయా? లేక బీజేపీతో పొత్తులకు దారి తీస్తాయా? అనేది చాలా కీలకం కానుంది. ఒకవేళ పొత్తులకు దారితీస్తే ఏపీలో మళ్ళీ పార్టీల బలాబలాలు మారుతాయి. అలాగే టిడిపి, జనసేన, వైసీపిల భవిష్యత్‌ కూడా మారవచ్చు. ఏది ఏమైనప్పటికీ, వీరి నలుగురు భేటీ వైసీపికి ఓ కొత్త ఆయుధాన్ని అందించిందని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories