టిడిపి యువనేత నారా లోకేష్ నేడు చంద్రగిరి నియోజకవర్గంలో 30వ రోజు యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా కాసిపెంట్ల గ్రామంలో మహిళలతో మాట్లాడుతూ చిన్న టిఫిన్ కొట్టు పెట్టుకొని బ్రతుకుతున్న ముని రాజమ్మ అనే ఓ బీసీ మహిళని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, అనుచరులు ఏవిదంగా వేధించారో నారా లోకేష్ వారికి వివరించారు.
“పాదయాత్రలో ఆమెని కలిసినప్పుడు ఆమె తాను డీటీటీ కింద చిన్న ఇల్లు కట్టుకొంటున్నానని, దానికి కరెంట్ కనెక్షన్ ఇప్పించమని అడిగితే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అనుకఃరులు లంచం అడిగారని తన బాధ నాతో చెప్పుకొన్నారు. నాతో ఆమె దిగిన ఫోటో, ఆమె చెప్పిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎమ్మెల్యే అనుచరులు వచ్చి ఆమె టిఫిన్ కొట్టుపై దాడి చేసి ధ్వంసం చేశారు. పైగా బీసీ వర్గానికి చెందిన ఆ అమ్మ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయించారు. రాష్ట్రంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఓ నిరుపేద బీసీ మహిళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం చూశామా?
చంద్రబాబు నాయుడు, అంతకు ముందు పాలించిన కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యల ప్రభుత్వాలలో కూడా ఇటువంటివి జరురుగలేదు. చివరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కూడా బీసీ మహిళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టలేదు. కానీ ఆయన కొడుకు సిఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇటువంటి విడ్డూరాలు ఎన్నో చూస్తున్నాము. ఎందుకంటే భారతదేశమంతా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ వ్రాసిన రాజ్యాంగం అమలవుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్ తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది కనుక!
పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేతని కలిసి ప్రజలు తమ సమస్యలని చెప్పుకోవడం తప్పా? కరెంట్ కనెక్షన్ కోసం వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు ఆ నిరుపేద మహిళని లంచం కోసం పీడిస్తున్నారనే విషయం సోషల్ మీడియా ద్వారా జగన్ దృష్టికి వస్తే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? ఆమె మీద ఆమెని పీడించి దాడి చేసిన తన ఎమ్మెల్యే మీదనా?” అని నారా లోకేష్ ప్రశ్నించారు.



